విద్యార్థుల ఆత్మహత్యల్లో ఐఐటీ చెన్నై టాప్: 10 ఐఐటీల్లో 27 మంది విద్యార్థులు సూసైడ్
ఇండోర్: గత ఐదేళ్లలో దేశంలోని 10 ఐఐటీలకు చెందిన 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. కేంద్ర మానవవనరుల శాఖ కింద పనిచేసే ఉన్నత విద్యాశాఖ అందించిన రిపోర్టు ప్రకారం మద్రాస్ ఐఐటీలో అత్యధికంగా విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని తెలుస్తోంది. ఈ ఒక్క ఐఐటీలోనే ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు
డిసెంబర్ 2న చంద్రశేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి సమాచారం కావాలంటూ ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు ఐఐటీ చెన్నైలో ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా... ఐదు మంది ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ముగ్గురు ఐఐటీ హైదరాబాద్కు చెందిన స్టూడెంట్స్ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించింది. ఐఐటీ బాంబేకు చెందిన ఇద్దరు విద్యార్థులు, ఐఐటీ గౌహతికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఐఐటీ రూర్కీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ ఐదేళ్ల కాలంలో సూసైడ్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఐఐటీ వారణాసి, ఐఐడీ ధన్బాద్, ఐఐటీ కాన్పూర్లలో ఒక్కో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
ఆత్మహత్యకు గల కారణాలపై సమాధానం ఇవ్వని కేంద్రం
ఇదిలా ఉంటే విద్యార్థులు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వలేదు. ఇక ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడుగగా... ఐఐటీ క్యాంపస్లోని విద్యార్థులు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించినట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పాట్నాలో పేద విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ ఇస్తున్న సూపర్ 30 ఇన్స్టిట్యూట్ అధినేత ఆనంద్ కుమార్ దేశంలోని టాప్ ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటీలో జరుగుతున్న అడ్మిషన్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేయాలని చెప్పారు. వివిధ ఒత్తిళ్లను తట్టుకునే విద్యార్థులకు మాత్రమే ఐఐటీ అడ్మిషన్స్లో తొలి ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అంతేకాదు విద్యార్థుల టీచర్ నిష్పత్తి క్రమం కూడా సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రత్యేక ఇంగ్లీషు క్లాసెస్ నిర్వహించాలి
ఇంగ్లీషు మీడియం నుంచి కాకుండా ఇతర మీడియంల నుంచి ఐఐటీల్లో అడ్మిషన్స్ పొందే విద్యార్థులకు ప్రత్యేక ఇంగ్లీష్ తరగతులు నిర్వహించాలని ఆనంద్ కుమార్ చెప్పారు. ఇలా చేయడం వల్ల వారి కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇండోర్, పాట్నా, జోద్పూర్, భువనేశ్వర్, గాంధీనగర్, రోపార్, మండి, తిరుపతి, పాలక్కడ్, భిలాయ్, జమ్ము, గోవా, ధార్వాడ్లలో గత ఐదేళ్లలో ఐఐటీలు వచ్చాక అక్కడ ఒక్క సూసైడ్ కేసు కూడా నమోదు కాలేదని ఆర్టీఐ పేర్కొంది.