ప్రాణం తీసిన పబ్జీ: గేమ్ ఆడుతుండగా యువకుడికి హార్ట్ స్ట్రోక్, కుప్పకూలిన హర్షల్..
పబ్జీ రక్కసి మరొకరిని బలితీసుకుంది. పబ్జీ గేమ్కు బానిసైన యువకుడు ఆటలో లీనమై ఒత్తిడికి గురయ్యారు. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా.. రెండురోజులు చికిత్స పొంది చనిపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
రెండేళ్లుగా పబ్జీ..
మహారాష్ట్ర పుణెలో ఘటన జరిగింది. పుణె శివారు పింప్రిలో గల రావెత్కు చెందిన హర్షల్ దేవిదాస్ మేమనే (27) పదో తరగతి వరకు చదివాడు. తర్వాత చదువు ఆపేసి పనిచేశాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా హౌస్ కీపింగ్ చేశాడు. కానీ తర్వాతే పనీ పాట లేకుండా ఇంట్లో ఉండటం ప్రారంభించాడు. దీంతో పబ్జీ అనే ఆటకు అడిక్ట్ అయ్యాడు. ఇంకేముందు రేయింవళ్లు ఆటలోనే లీనమైపోయాడు. గత రెండేళ్ల నుంచి పబ్బీ ఆడటంతో తీవ్ర ఇత్తిడికి గురయ్యాడు. ఇంట్లోవాళ్లు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. హర్షల్ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. అతనికి ఇద్దరు సోదరులు, ఒక సోదరి కూడా ఉన్నారు.
కుప్పకూలిపోయి..
పబ్జీ గేమ్ ఆడుతుండగా గురువారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు కంగారుపడి.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రావెత్లోని ఓజాస్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కానీ మెరుగైన చికిత్స కోసం పింప్రీలోని యశ్వంతరావు చావన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం నుంచి ఆస్పత్రిలోని చికిత్స తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురై హర్షల్ మృతిచెందారని వైద్యులు ప్రకటించారు.
గుండెపోటు
పబ్జీ గేమ్ ఆడి.. ఆడి... హర్షల్ నరాలు చిట్లీపోయి, రక్తపీడనం పెరిగి గుండెపోటుకు గురయ్యారని ప్రాథమిక నివేదికలో వైద్యులు రిపోర్ట్ చేశారు. ఇంట్లో ఎప్పుడూ పబ్జీ గేమ్ ఆడతాడని కుటుంబసభ్యులు చెప్పడంతో మెదడులో నరాలు ఒత్తిడికి గురై చిట్లిపోయి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. హర్షల్ మృతిని పోలీసులు మెడి కో లీగల్ కేసుగా నమోదు చేశారు.