ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత... సిస్టర్ అభయ హత్య కేసులో నేడే కోర్టు తుది తీర్పు...
కేరళలో 1992లో జరిగిన సిస్టర్ అభయ హత్య కేసులో తిరువనంతపురం సీబీఐ స్పెషల్ కోర్టు మంగళవారం(డిసెంబర్ 22) తుది తీర్పు వెల్లడించనుంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగుతూ వచ్చిన ఈ కేసు ఒకప్పుడు కేరళలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 27,1992న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో క్రైస్తవ సన్యాసిని అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది.
సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఆమె భుజం,కుడి చెవిపై బలమై గాయాలైనట్లు నిర్దారించింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న క్రైస్తవ పూజారులు థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్తో పాటు ఓ క్రైస్తవ సన్యాసిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు.
తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి రావడంతో న్యాయస్థానం ఎటువంటి తీర్పును వెలువరించబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.