Coronavirus: కేరళలో కరోనా విజృంభించిందా? 2,826 అనుమానిత కేసులు నమోదు: ఆరోగ్యమంత్రి
Recommended Video
తిరువనంతపురం: చైనాలో వందలాది మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ క్రమంగా భారత్లో విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలో భారీ ఎత్తున కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇదే రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఇదివరకే పాజిటివ్గా తేలాయి. తాజాగా- 2826 అనుమానిత కేసులు నమోదు కావడం కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అనుమానితులందరినీ వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జనవరి 15వ తేదీ తరువాత చైనా నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన వారికి తాము వరుసగా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.
ఇందులో 2,743 మందిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచి వైద్య పరీక్షలను చేస్తున్నామని చెప్పారు. మరి కొందరికి 83 ఆసుపత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. దశలవారీగా వారి రక్త నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపిస్తున్నామని అన్నారు. ఇప్పటిదాకా మొత్తం 263 రక్త నమూనాలను పంపించామని, గురువారం నాటికి 229 నమూనాలు నెగిటివ్గా తేలాయని వివరించారు. ఇప్పటిదాకా మూడు కేసులు మాత్రమే పాజిటివ్గా నిర్ధారించినట్లు చెప్పారు. వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నామని శైలజ చెప్పారు.
విదేశాల నుంచి ప్రత్యేకించి- చైనా నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారిని పరీక్షించడానికి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాల్లో థర్మల్ పరికరాలను అందుబాటులో ఉంచామని, అయినప్పటికీ.. అనుమానిత కేసులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని అన్నారు. పరిస్థితులను అదుపు చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించామని గుర్తు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. వైరాలజీ సంస్థకు తాము పంపించిన అన్ని నమూనాలు కూడా నెగెటివ్గా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.