కోర్టులో అంతిమ తీర్పు, శిక్ష పడుతుందని మూడో అంతస్తు నుంచి దూకి ఖైదీ ఆత్మహత్య !
బెంగళూరు: కోర్టు భవనం మీద నుంచి కిందకూ దూకి ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోర్టులో జరిగింది. కోర్టు అంతిమతీర్పు ఇస్తుందని ఆవేదన చెందిన చంద్రయ్య (29) అనే యువకుడు అదే భవనం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
హత్యాయత్నం
తుమకూరు జిల్లా గుబ్బి తాలుకా అదలకెరె గ్రామానికి చెందిన చంద్రయ్య తన బంధవు అయిన వ్యక్తి మీద కొడవలితో దాడి చేసి హత్యాయత్నం చేశాడని కేసు నమోదు అయ్యింది. పోలీసులు చంద్రయ్యను అరెస్టు చేసి తుమకూరు జిల్లా కేంద్ర కారాగానికి తరలించారు.
కోర్టులో అంతిమతీర్పు
కోర్టులో కేసు విచారణ పూర్తి అయ్యింది. మే 26వ తేదీ శనివారం కేసు అంతిమతీర్పు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. శనివారం చంద్రయ్యను జైలు నుంచి తుమకూరు జిల్లా కోర్టుకు పిలుచుకుని వెళ్లారు. మూడో అంతస్తులోని కోర్టు ఆవరణంలో చంద్రయ్య, పోలీసులు ఉన్నారు.
మూడో అంతస్తు
కోర్టు ఎక్కడ తనకు ఎక్కువ శిక్ష విధిస్తుందో అని చంద్రయ్య ఆందోళన చెందాడు. కోర్టు తీర్పు రాకముందే మూడో అంతస్తు మీద ఉన్న చంద్రయ్య ఒక్కసారిగి కిందకూ దూకేశాడు. ఉలిక్కిపడిన పోలీసులు కిందకు పరుగు తీసి తీవ్రగాయాలై చంద్రయ్యను తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
విచిత్ర ప్రవర్తన
చికిత్సకు సహకరించని చంద్రయ్య మరణించాడని వైద్యులు చెప్పారు. చంద్రయ్య జైల్లో కూడా కొంతకాలంగా మానసిక అస్వస్థతకు గురైనట్లు విచిత్రంగా ప్రవర్తించేవాడని సాటి ఖైదీలు చెప్పారని పోలీసులు అన్నారు. చంద్రయ్య మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.