పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చకు లోక్సభ ఆమోదం, అనుకూలం 293, వ్యతిరేకం 82 మంది
పౌరసత్వ సవరణ బిల్లు లోక్సభలో దుమారం రేపింది. బిల్లుకు కొన్ని సవరణలు చేసి సోమవారం హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం ఉందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. సభలో గందరగోళం మధ్య బిల్లు ప్రవేశపెట్టేందుకు దిగువసభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు ఓటేశారు. సభకు మొత్తం 375 మంది సభ్యులు హాజరయ్యారు.
మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లు ఉందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యతిరేకంగా ఓటేయాలని తమ పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ విప్ జారీచేసింది. టీఎంసీ కూడా బిల్లును వ్యతిరేకించింది. పౌరసత్వ సవరణ బిల్లు సమానత్వపు హక్కుకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బిల్లుతో ఇండియా ఇజ్రాయెల్గా మారుతోందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సభ నుంచి వాకౌట్ చేయొద్దని విపక్షాలకు సూచించారు. అన్నీ ప్రశ్నలకు సమాధానం చెబుతానని తెలిపారు.
పౌరసత్వంపై నరేంద్ర మోడీ సర్కార్ ఎలాంటి వివక్ష చూపడం లేదని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎందుకు ఆశ్రయం ఇవ్వలేదు అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులను 1971లో ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన వారిపై ఎందుకు ద్వేషం.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారపై ఎందుకు సానుభూతి తెలిపారని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కు విరుద్ధం కాదని అమిత్ షా స్పష్టంచేశారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల, సిక్కులు వివక్షకు గురవుతున్నారని చెప్పారు. సవరణ బిల్లుతో దేశంలో మెజార్టీ వర్గాలకు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. 1971లో కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా విభజించిందని మండిపడ్డారు. కానీ తాము అందరూ సమానం అని చెప్తున్నామని అమిత్ షా స్పష్టంచేశారు.