2జీ: రాజా, కనిమొళిలతో పాటు అమ్మాళ్పై ఛార్జ్షీట్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళి, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ సహా సహా మొత్తం 19మందిపై సెక్షన్ 120-బి (క్రిమినల్ కుట్ర) అభియోగాలు నమోదయ్యాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నివేదిక ఆధారంగా ఆధారంగా శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు మనీ లాండరింగ్ చట్టం కింద ఈ ముగ్గురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎ. రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దయానధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వీరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కి కూడా కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ 2జీ కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ పేరు కూడా వచ్చింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ చీఫ్ వినోద్ రాయ్ ‘టైమ్స్ నౌ'న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2జీ స్పెక్ట్రమ్ ద్వారా కేటాయింపుల కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 కోట్లు నష్టం వాటిల్లిన సంగతి తనకు తెలియదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం అబద్దమని అన్నారు. ఈ కుంభకోణం గురించి ఆయనకు తెలిసే జరిగిందని పేర్కొన్నారు.
2జీ కుంభకోణం అసలు ఏం జరిగింది:
డిబిగ్రూపు కంపెనీలకు టెలికం అనుమతులిచ్చినందుకుగాను డిఎంకె ఆధ్వర్యంలో నడిచే కలైంగార్ టివికి రూ. 200 కోట్లు పెట్టుబడులు మళ్లించారని, నిందితులు మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
రాజా, కనిమొళితో పాటు స్వాన్ టెలికం ప్రమోటర్స్ షాహీద్ ఉస్మాన్ బల్వా, వినోద్, కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, కలైంగార్ టివి ఎండి శారద్ కుమార్, బాలీవుడు నిర్మాత కరీమ్ మోరాని, అమ్మాళ్, పి అమిృతంలను నిందితులుగా చేర్చింది.
ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ కేసు కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ టెలికం మంత్రి ఎ రాజా, డిఎంకె ఎంపీ కనిమొళితో సహా మరో ఏడుగురికి ప్రత్యేక న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేసింది.