2జీ కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలకు క్లీన్చిట్
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి పి. చిదంబరంలకు సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి) శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. జెపిసిలోని 30మంది సభ్యులలో 15-11తేడాతో నివేదిక ఆమోదం పొందడంతో వారికి క్లీన్ చిట్ లభించింది. 2జీ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టెలికాం శాఖ మంత్రి ఎ. రాజా వాదనను పరిగణలోకి తీసుకోకుండానే ప్రధానికి, ఆర్థిక మంత్రికి జెపిసి క్లీన్చిట్ ఇచ్చింది.
పీసీ చాకో అధ్యక్షత వహించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికపై చర్చలేమి లేకుండానే ఓటింగ్కు వెళ్లి ఆమోదింపజేసుకుంది. పీసీ చాకో చర్యను జెపిసి సభ్యుడు గురుదాసు గుప్తా తీవ్రంగా వ్యతిరేకించారు. 2జీ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్, చిదంబరంలకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈ రోజును చీకటి దినంగా పరిగణిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ, సిపిఎం, పలు ప్రతిపక్ష్ పార్టీల నాయకులు తెలిపారు. జెపిసి మరో నివేదికను తయారు చేసి అందులో వాస్తవాలను ప్రస్తావించాలని వారు డిమాండ్ చేశారు.
జెపిసి తన నివేదికలోఅప్పటి టెలికాం మంత్రి ఎ. రాజాను తప్పుపట్టింది. 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి పూర్తి బాధ్యత అతనిదేనని, రాజానే అవకతవకలకు పాల్పడ్డట్లు నివేదిక పేర్కొంది. 2జీ కుంభకోణానికి ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరంలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం మారుతున్నరాజకీయ సమీకరణల్లో భాగంగానే రాజాను నిందితునికి పేర్కొన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2జీ కుంభకోణంలో ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లందని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఇంతకుముందే స్పష్టం చేసింది.
గతంలో 2జి కుంభకోణానికి సంబందించిన విచారణ చేపట్టేందుకు ఫిబ్రవరి 2011లో జెపిసి నియమించడం జరిగింది. సెప్టెంబర్ 23న తన నివేదికను ప్యానెల్ ముందు ప్రవేశపెట్టింది. ఆ నివేదికను ఏప్రిల్ 2013 వరకుప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కాగా శుక్రవారం జెపిసి 15-11 సభ్యుల తేడాతో తన నివేదికను ఆమోదించుకుని ప్రధాని మన్మోహన్కు, ఆర్థిక మంత్రి చిదంబరంలకు క్లీన్ చిట్ ఇచ్చింది.