2జీ కుంభకోణం: 'మన్మోహన్ను ఏ రాజా తప్పదోవ పట్టించారు'
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణలో మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే నేత ఏ రాజా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను ఏ రాజా ఉద్దేశపూర్వకంగా తప్పదోవ పట్టించారంటూ ప్రత్యేక కోర్టుకి బుధవారం సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తుది విచారణ ప్రారంభమైంది.
విధాన నిర్ణయాలను ఆయన ప్రభావితం చేశారని సీబీఐ ఆరోపణలు చేసింది. కొన్ని టెలికమ్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు కాల వ్యవధిని అప్పటి టెలికం మంత్రి ఏ రాజా తగ్గించారని సీబీఐ తెలిపింది. అనర్హులైన స్వాన్ టెలికం ప్రై లిమిటెడ్, యునిటెక్ వైర్లెస్ లిమిటెడ్ లాంటి కంపెనీలకు 2జీ స్పెక్ట్రంలను కట్టబెట్టారని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో వాదించింది.
నవంబర్ 2, 2007లో ఏ రాజా అప్పటి ప్రధాని మన్మోహాన్కు రాసిన లేఖ దీనికి ఆధారమని సీబీఐ పేర్కొంది. వాదనలు విన్న అనంతరం ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఓపీ సైనీ విచారణను మే 25కు వాయిదా వేశారు. 122 లైసెన్సుల 2జీ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం రూ. 30,984 కోట్లు నష్టపోయిందని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది.
ఇప్పటి వరకు ఈ కేసులో 154 మంది సాక్ష్యులను సీబీఐ విచారించింది. 2జీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ రాజా, ఎంపీ కనిమొళిలు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.