2జీ స్కాం: సీబీఐ ఆరోపించింది రూ.30,984 కోట్ల నష్టం, డీఎంకే సంబరాలు
Recommended Video
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణంగా 2జీ స్కాంను చెబుతారు. సంచలనం సృష్టించిన ఈ స్కాంలో టెలికం శాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపి కనిమొళిని పాటియాలా కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. యూపీఏ హయాంలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆ సమయంలో డీఎంకేకు చెందిన ఎ రాజా టెలికాం శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన నేతృత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ ఆరోపించింది.
2జీ కేసులో రాజా, కనిమొళిలు నిర్దోషులు: పటియాల కోర్టు సంచలన తీర్పు
అవినీతి వల్ల 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ
ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని నాడు వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్ పేర్కొంది. కాగ్ ఆరోపణలు చేయడంతో 2010లో రాజాను నాటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. రాజా, కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పోరేట్ సంస్థల అధికారులపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.
అందరిని నిర్దోషులుగా తేల్చారు
2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైలులో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ కేసుపై 2011 నుంచి విచారణ జరుగుతోంది. ఇప్పుడు పాటియాలా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అందరిని నిర్దోషులుగా తేల్చడంతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సీబీఐ ఆరోపణ రూ.30వేల కోట్లు
యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన వేర్వేరు కేసులపై తీర్పును ఇచ్చాయి. ఈ కేసులో ఆరు నెలల నుంచి యావజ్జీవం వరకు శిక్షపడేందుకు అవకాశం ఉన్న అభియోగాలను 17 మందిపై మోపారు. 122 అనుమతుల్ని మంజూరు చేయడంలో రూ.30,984 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది.
డీఎంకే సంబరాలు
పాటియాలా సీబీఐ కోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ తీర్పుతో న్యాయం గెలిచిందని, ఇది తమిళనాడు ప్రజలందరికీ సంతోషకరమైన వార్త అని డీఎంకే నేతలు అన్నారు.