‘పరప్పన’లో అక్రమాలు నిజమేనా? పెండింగులో విశ్రాంత ఐఏఎస్ అధికారి నివేదిక!
పరప్పన అగ్రహార కారాగారంలో అక్రమాలు జరిగాయని సీనియరు పోలీసు అధికారిణి రూపా మౌడ్గిల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు: పరప్పన అగ్రహార కారాగారంలో అక్రమాలు జరిగాయని సీనియరు పోలీసు అధికారిణి రూపా మౌడ్గిల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వారం కిందటే ఆయన తన నివేదికనుహోంశాఖకు అందించినా- శాసనసభ సమావేశాల నేపథ్యంలో అందులోని అంశాలు బయటికి రాకుండా కాపాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శశికళ, ఆమె వదిన ఇళవరసి ఉండేందుకు పరప్పన అగ్రహారం జైల్లో ఐదు గదులు, వారు ఏ పనీ చేయకుండా.. కావలసిన చోటికి తిరిగేందుకు అవకాశం ఇవ్వటం, అతిథులతో గంటల తరబడి ముచ్చటించుకునేందుకు ఏకాంతం కల్పించటం, బయటి నుంచి తీసుకు వచ్చే ఆహారాన్ని అనుమతించటం తదితర అంశాలపై వినయ్ కుమార్ దర్యాప్తు చేశారు.
నకిలీ స్టాంపు కాగితాల కేసు నిందితుడు కరీంలాలా తెల్గీ కారాగారంలో ఉన్న సమయంలో అతనికి మర్దన చేసేందుకు ఒక సహాయకుడిని అందించేందుకు కూడా కారాగారంలోని అధికారులు ముడుపులు తీసుకున్నారని కుమార్ తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
కారాగారంలో ఒక ఖైదీ అక్కడి వైద్యాలయంలోని వైద్యునిపై దాడి చేసిన ఘటనను కూడా భద్రతా సిబ్బంది తీవ్రంగా పరిగణించలేదని వినయ్ కుమార్ దర్యాప్తులో తేలినట్లు తెలిసింది.
విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నివేదికపై హోంశాఖకు చెందిన కొంతమంది అధికారులు లీకులిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆ నివేదికను తామింకా పరిశీలించలేదని హోం మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులకు తెలిపారు.