'జెఎన్యూ వర్సిటీలో రోజుకు 3000 కండోమ్లు'
న్యూఢిల్లీ: జాతి వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో న్యూఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) పేరు ఇప్పటికే వార్తల్లో మారుమ్రోగి పోయింది. దీంతో జెఎన్యూ రగడ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జెఎన్యూ విద్యార్ధులు తాగుబోతులని, తిరుగుబోతులని అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ ప్రాంగణంలో రోజుకు 3000 వాడిన కండోమ్లు, 4000 వరకూ మద్యం సీసాలు కనిపిస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు వర్సిటీ విద్యార్ధులు డ్రగ్స్కు బానిసలని, క్యాంపస్లో కనిపించే అల్యూమినియం ఫాయిల్సే ఇందుకు నిదర్శమన్నారు.
విద్యార్ధులు చాలా మంది రాత్రి 8 గంటలత తర్వాత డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, జాతి వ్యతిరేకులైన విద్యార్ధులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు జెఎన్యూ విద్యార్ధులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన దేశ ద్రోహిగా, జాతి వ్యతిరేకిగా అభివర్ణించారు. రాహుల్ను ఉరి తీయాలని, కాల్చిపారేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, వామపక్షాలు భారత వ్యతిరేక పార్టీలని, ఆయా పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలోని రామ్ఘర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సోమవారం బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సైతం జెఎన్యూ రగడపై స్పందించారు.
జెఎన్యూ రగడమై ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తిరిగి మళ్లీ యధాస్థితికి రావాలంటే నాలుగు నెలలపాటు మూసివేయాలని సూచించారు. యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్ధిని ప్రశ్నించాలన్నారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఏళ్ల తరబడి యూనివర్సిటీలో చదువుతున్న పొలిటికల్ సైన్స్, సోషియాలజీ చదువుతున్న విద్యార్ధులను ప్రశ్నించాలన్నారు.