మతం మారబోతున్న 3 వేల మంది దళితులు, ఎక్కడో, ఎందుకో తెలుసా...?
తమిళనాడులో 3 వేల మంది దళితులు ఇస్లాం మతంలో మారబోతున్నారు. మెట్టుపళ్యం మున్సిపాలిటీకి చెందిన వీరంతా ముస్లిం మతంలోకి మారుతామని ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి గోడ కూలి 17 మంది దళితులు మృతిచెందారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తగిన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఇస్లాంలోకి మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కూలిన గోడ..
కోయంబత్తూు జిల్లా మెట్టుపాళ్యం సమీపంలోని నడూర్లో ఈ నెల 2వ తేదీన గోడ కూలింది. భారీ వర్షాలకు 15 ఫీట్ల ఎత్తు గల గోడ కూలిపోయింది. గోడ ఆవల దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారివి చిన్నకులమని అగ్రవర్ణానికి చెందిన టెక్స్ టైల్ వ్యాపారి వ్యక్తి పెద్ద గోడ నిర్మించారు. అయితే అర్ధరాత్రి గోడ కూలి పక్కనే ఉన్న వారిపై పడింది. దీంతో పక్కపక్కనే ఇళ్లు ఉన్న ఐదు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. గాఢ నిద్రలోనే 17 మంది చనిపోయారు.
బెయిల్..
ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటనాస్థలాన్ని సీఎం పళనిస్వామి, మంత్రులు పరిశీలించారు. కానీ అంగ, అర్ధబలం ఉన్న వ్యాపారిపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. గోడ కూలిన ఘటనపై వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఏం లాభం 20 రోజుల తర్వాత ఆయన బెయిల్పై బయటకు రావడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. తమకు హిందు మతంలో చిన్నచూపు ఉందని భావించి, మతం మారాలని అనుకొంటున్నారు.
చిన్నచూపు
అగ్రవర్ణాలు తమను చిన్నచూపు చూస్తున్నారని ఆ ప్రాంత దళితులు భావిస్తున్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 3 వేల మంది దళితులు మత మార్పిడి చేయాలని అనుకొంటున్నారు. తమిళనాడులో హిందువులు అధికంగా ఉంటారు. ఐకమత్యంగానూ ఉంటారు. అయితే అగ్రవర్ణాల వారు తమను మనుషులుగా కూడా చూడటం లేదని, అందుకే మత మార్పిడి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. 3 వేల మంది దళితులు మత మార్పిడి చేసుకోవాలని అనుకోవడం చర్చకు దారితీసింది.