ఢిల్లీ, నోయిడాలో భూకంపం: పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు నోయిడాలో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 3.2గా తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం నోయిడాకు ఆగ్నేయంలో 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) తెలిపింది.
బుధవారం రాత్రి 10.42 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అయితే, స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.
కాగా, ఢిల్లీ గత నెలరోజుల్లోనే ఆరు నుంచి ఏడు భూకంపాలకు గురికావడం గమనార్హం. ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ఢిల్లీని.. ఈ భూకంపాలు కూడా హడలెత్తిస్తున్నాయి.
భూకంపం కారణంగా ప్రజలు తమ నివాసాల నుంచి బయటకి పరుగులు తీశారు. కాగా, ఇటీవల కాలంలో ఢిల్లీతోపాపాటు నోయిడా, గుర్గావ్ లాంటి నగరాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఇక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.