నోట్లు రద్దు ఎఫెక్ట్: రూ.3.5 కోట్లు నదిలో పారేశారు
అస్సోం: పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ ఉన్న భారీ నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక హైరానా పడుతున్నారు. కొందరు అడ్డదారుల్లో తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు గుప్త దానాలు చేస్తున్నారు.
ఇంకొందరైతే తమ వద్ద ఉన్న ధనాన్ని కాల్చేయడం, చెత్త కుప్పల్లో పారేయడం చేస్తున్నారు. తాజాగా, అస్సాంలోని ఓ నదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3.5 కోట్ల నగదును చించి పారేశారు.
చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు స్థానిక భరాలు నది సమీపంలోని నారెంగి రైల్వేస్టేషన్ డ్రెయిన్లో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం అస్సాంలోని చందన్నగర్, రుక్మిణిగావ్ ప్రాంతాల్లో చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు డ్రైనేజీలో లభ్యమయ్యాయి. కాగా, ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటుండటం గమనార్హం.