కలకలం: తుపాకీ చూపి కారు చోరీ, ఉగ్రవాదులేనా?
పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్లో మళ్లీ కలకలం రేగింది. సుజన్పూర్ ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఓ స్థానికుడి కారును అపహరించారు. దీంతో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఈ ఏడాది జనవరిలో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ ఘటనకు ముందు కూడా కొందరు ఉగ్రవాదులు ఓ పోలీస్ అధికారి కారును దొంగలించిన విషయం తెలిసిందే.
తాజా ఘటనలో పఠాన్కోట్-జమ్ము హైవేలో వెళ్తున్న కారును ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. పెట్రోల్ కావాలని అడిగి.. తర్వాత నాటు తుపాకీలతో కారు యజమానిని బెదిరించి కారును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది ఉగ్రవాద ఘటన కాదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశామని వెల్లడించారు.