ఇండో-మయన్మార్ బార్డర్: అంబుష్ పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని భారత్-మయన్మార్ దేశాలకు సరిహద్దుగా ఉన్న ఛందేల్ జిల్లాలో అనుమానిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మిలిటెంట్లు పేల్చిన అంబుష్ ఘటనలో ముగ్గురు అస్సామ్ రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఖోంగ్టల్ వద్ద పహారా కాస్తున్న సమయంలో బుధవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు అంతర్జాతీయ సరిహద్దులో విధుల నిర్వహించి వస్తున్న సమయంలో మిలిటెంట్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారని అధికారులు తెలిపారు.
బేస్ క్యాంపునకు రెండు కిలోమీటర్ల దూరంలోని సాజిక్ టాంపక్ గ్రామం వద్దకు రాగానే ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో హవిల్దార్ ప్రణయ్ కలిట, రైఫిల్ మ్యాన్ వైఎం కోన్యక్, రైఫిల్ మ్యాన్ రతన్ సలీమ్ మృతి చెందారు. గాయపడిన మరో ఐదుగురు జవాన్లను మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. అయితే, ఈ పని చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)పై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అస్సామ్ రైఫిల్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.