ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
ఢిల్లీ : ఎన్నికలకు ముందే బీజేపీ బోణీ కొట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎలక్షన్లు జరగకుండానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. బోణీ ఏంటి..? ఎన్నికలు జరగకుండానే ఈ ఫలితాలేంటని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు చదివింది నిజమే. ఎన్నికలు జరగకుండానే బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు అదృష్టవంతులయ్యారు. కాలం కలిసొచ్చి ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్యేలు అయ్యారు.
బోణీ షురూ..!
అల్ఫాబెట్ A తో మొదలయ్యే అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి తొలి విజయం దక్కింది. ఎన్నికల తంతు లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థుల్ని విజయం వరించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారనే ప్రచారం కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. శాసనసభ బరిలో నిలిచిన ముగ్గురు బీజేపీ అభ్యర్థుల పంట పండింది. రెండు స్థానాల్లో ఇతర అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేని కారణంగా తిరస్కరణకు గురయ్యాయి. ఇంకో సెగ్మెంట్ లో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అలా ఆ మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించినట్లైంది.
అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సై
కలిసొచ్చిన తిరస్కరణ
పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కెంటో జిని గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయనకు పోటీగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిన్కిర్ లోల్లెన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో తప్పులు, ఇతర కారణాలతో ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. తండ్రి పేరుకు బదులుగా ఊరి పేరు రాశారట. అంతేకాదు విద్యార్హతలు, నియోజకవర్గం పేరు, వయసు తదితర ముఖ్యమైన వివరాలు పేర్కొనలేదట. ఎస్టీ సెగ్మెంట్ కావడంతో కుల ధృవీకరణ పత్రం కూడా జతపర్చకపోవడం మైనస్ అయింది.
ఒకచోట పొరపాటు.. మరోచోట ఉపసంహరణ
లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు తబా టెడిర్. జేడీయూ పార్టీ తరఫున యోకో యారమ్ అనే మహిళ అభ్యర్థి నామినేషన్ వేశారు. అయితే ఆమె నామినేషన్ పత్రాల్లో కొన్ని పొరపాట్లు దొర్లడంతో తిరస్కరించారు అధికారులు. దాంతో బీజేపీ అభ్యర్థి తబా టెడిర్ ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.
పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఫుర్ప సెరింగ్ నామినేషన్ వేశారు. ఆయనకు పోటీగా మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. తీరా ఉపసంహరణ సమయానికి వారిద్దరూ విత్ డ్రా చేసుకున్నారు. దాంతో పోటీలో మిగిలిన ఏకైక వ్యక్తిగా ఫుర్ప సెరింగ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ప్రకటించారు అధికారులు.