సోదరిని వేధించినందుకు.. చెయ్యి నరికేశారు..
పెళ్లైన తమ సోదరిని వెంటపడి వేధిస్తున్న ఓ వ్యక్తి చేయి నరికేశారు ముగ్గురు అన్నదమ్ములు.
గోరఖ్ పూర్: ఆమెకు పెళ్లి కాక ముందు వెంబడి పడి వేధించాడు. కేసు పెడితే జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా బుద్ది మారలేదు. సదరు మహిళకు పెళ్లైనా తన వేధింపులు మానుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన మహిళ సోదరులు అతని చేయి నరికేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గోరఖ్ పూర్ లోని సింధులి బిందులి ప్రాంతంలో రజ్మన్ నివసిస్తున్నాడు. ఇతను కొన్నాళ్ల పాటు ఓ యువతిని వెంబడిపడి వేధించాడు. ఆమెకు పెళ్లయ్యాక కూడా ఫోన్ ద్వారా వేధిస్తూ వస్తున్నాడు. పోలీస్ కేసు పెడితే జైలుకు వెళ్లొచ్చాడు. తిరిగొచ్చాక కూడా తీరు మారలేదు సరికదా మహిళ సోదరులతో గొడవపడ్డాడు.
దీంతో ఎలాగైనా అతగాడికి బుద్ది చెప్పాలని బాధిత మహిళ సోదరులు భావించారు. అదును కోసం చూస్తున్న సోదరులకు ఆ సమయం రానే వచ్చింది. సోమవారం నాడు రజ్మన్ స్థానికంగా ఉండే ఓ నదీ తీరాన ఉన్నట్టు బాధితురాలి సోదరులకు తెలిసింది. దీంతో బైక్ పై అక్కడికి చేరుకున్న ఉమేష్, కమలేష్, మిథిలేష్.. రజ్మన్ పై దాడి చేశారు.
దాడిలో సోదరులు ముగ్గురు కలిసి రజ్మన్ చేయి నరికేశారు. విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురు సోదరులపై కేసు నమోదు చేశారు.