కుప్పకూలిన 2భవనాలు: ముగ్గురు మృతి, శిథిలాల కింద 30మంది
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై కుప్పకూలింది. దీంతో ఆ భవనం కూలిపోయాయి. నాలుగు అంతస్తుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
ఈ సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం సహాయచర్యల్లో భాగంగా శిథిలాలను తొలగించే పనులను చేపట్టింది. శిథిలాల నుంచి మూడు మృతదేహాలను బయటకు తీశారు. భవన శిథిలాల్లో 30 మంది వరకూ చిక్కుకున్నారు. మరో 50 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు.
పొరుగున ఉన్న ఘజియాబాద్ నుంచి జాతీయ విపత్తు నివారణ బృందాన్ని రప్పించారు. వందలాది మంది పోలీసులు కూడా సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి వరకు అధికారులు ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసనకు దిగారు.
#UPDATE Building collapse in Greater Noida's Shah Beri village: 2 NDRF teams have reached the spot. Search & rescue operations are underway. pic.twitter.com/ZcIxx1a50B
— ANI UP (@ANINewsUP) July 17, 2018
భవనాలు కూలిన ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కాగా, ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.