అలీగఢ్లో పేలుడు: ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు..
ఉత్తరప్రదేశ్ అలీఘడ్ బొమ్మల ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఖాటికన్ ఏరియాలో గల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలింది. పేలుడు తీవ్రతకు పైకప్పు ఊడి పడిపోయింది. ఆ సమయంలో కార్మికులు బొమ్మలను తయారు చేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. పది మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రి, మల్కాన్ సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పేలుడు జరిగిన వెంటనే సమీపంలో గల ప్రజలు బయటకు వచ్చారు. పేలుడు తీవ్రతతో ఐదు ఇల్లు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారికి స్థానికులు సాయం చేశారు. ఘటనాస్థలంలో ఏదైనా పేలుడు పదార్థం తయారీ జరుగుతోందా అనే అంశంపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ అభిషేక్ కుమార్ తెలిపారు. పేలుడు తీవ్రతతో ధ్వంసమయిన భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడుతో అలీగఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.