పాయల్ తాడ్వీ సూసైడ్ కేసు : ముగ్గురు డాక్టర్ల అరెస్ట్
ఢిల్లీ : కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆమె సూసైడ్ చేసుకునేందుకు కారకులుగా భావిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళా డాక్టర్లను మంగళవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితురాలిని బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
బీఎస్పీ నేతపై దుండగులు కాల్పులు, అల్లుడూ కూడా హతం
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ముంబైలోని బీవైఎల్ నాయర్ హాస్పిటల్లో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న పాయల్ తాడ్వీని సీనియర్లు అయిన ముగ్గురు డాక్టర్లు కులం పేరుతో తరుచూ వేధించేవారు. వేధింపులు తాళలేక ఆమె ఈ నెల 22న ఆత్మహత్య చేసుకుంది. అంకితా ఖండేల్వాల్, హేమ అహూజా, భక్తి మహెరే అనే ముగ్గురు లేడీ డాక్టర్లు ఇందుకు కారణమని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలడంతో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, ఐటీ యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకుగానూ ఐపీసీ సెక్షన్ 306కింద కేసు బుక్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
నిందితులను సస్పెండ్ చేసిన ఎంఏఆర్డీ
మంగళవారం సాయంత్రం భక్తి మహెరే, హేమ అహుజను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బుధవారం తెల్లవారు జామున అంకితా ఖండేల్వాల్ను అగ్రిపడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పాయల్ ఆత్మహత్యతో తమకెలాంటి సంబంధంలేదని నిందితులు అంటున్నారు. పోలీసుల విచారణ తీరును ముగ్గురు తప్పుబట్టారు. మరోవైపు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ముగ్గురు నిందితులను సస్పెండ్ చేసింది. నిందితులు తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
పాయల్ తల్లిదండ్రుల నిరసన
ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ పాయల్ పనిచేసిన హాస్పిటల్ బయట ఆమె తల్లిదండ్రులు నిరసన చేప్టటారు. దళిత, గిరిజన కార్యకర్తలు వారికి మద్దతు తెలిపారు. పేషెంట్ల ముందే ఆ ముగ్గురు నిందితులు తన ముఖంపై ఫైల్లు విసిరికొట్టేవారని, తమ కూతురు తమకు చెప్పిందని పాయల్ తల్లి చెప్పారు. వారిపై కంప్లైంట్ చేయాలని చెప్పినా వాళ్ల కెరీర్ దెబ్బతింటుందన్న కారణంతోనే ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాయల్ మృతికి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ డైరెక్టర్ ఆఫ్ హాస్పిటల్కు లేఖ రాసింది. దర్యాప్తు వివరాలతో పాటు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. అటు స్టేట్ ఉమెన్ కమిషన్ సైతం హాస్పిటల్కు నోటీసులు పంపింది. పాయల్ ఆత్మహత్య వ్యవహారంపై 8రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.