ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు ఎయిమ్స్ వైద్యులు దుర్మరణం
న్యూఢిల్లీ : మధుర సమీపంలోని యమునా ఎక్స్ప్రెస్వేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన ముగ్గురు వైద్యులు దుర్మరణం పాలవగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది.
కారులో ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తుండగా.. కారు ఒక కంటైనర్లోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ యష్పాల్, డాక్టర్ హర్షద్, డాక్టర్ హేంబాల అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ హర్షద్ పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిలో డాక్టర్ కేథరిన్ హలం, డాక్టర్ మహేష్ కుమార్, డాక్టర్ జితేందర్ మౌర్య, డాక్టర్ అభినవ సింగ్ ఉన్నారు. ఇటీవలి కాలంలో యమునా ఎక్స్ ప్రెస్ వేపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.