విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్: ముగ్గురికి ఉరి శిక్ష
కోల్ కతా: కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కోల్ కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా గుర్తించింది. ముగ్గురికి మరణ శిక్ష (ఉరి శిక్ష), మరో ముగ్గురికి జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ శనివారం తీర్పు చెప్పింది.
2013 జూన్ లో కామదుని ప్రాంతానికి చెందిన శిప్రా ఘెష్ (20) అనే కాలేజ్ యువతిని కిడ్నాప్ చేసిన నిందితులు కోల్ కతాకు 30 కిలో మీటర్ల దూరం తీసుకు వెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆమె గొంతు కోసి దారుణంగా హింసించి చంపేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 8 మందిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు నిర్దోషులు అంటూ ఇటీవల కోర్టు వారిని విడుదల చేసింది. ఆ ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్లే విడుదల చేశారని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్ బిమన్ బసు మండిపడ్డారు.
కేసు విచారణ పూర్తి కావడంతో ఆరు మంది దోషులు అని న్యాయస్థానం గుర్తించింది. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ శనివారం సంచలనమైన తీర్పు చెప్పింది. అయితే శిప్రా ఘెస్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఏ విధంగా స్పందించలేదు.