ఓ వ్యాపారి, ముగ్గురు యువతులు.. రొమాన్స్ పేరుతో ముగ్గులోకి.. చివరకు..!
ఉత్తర ప్రదేశ్ : వ్యాపారులకు వల వేస్తూ ముగ్గులోకి దించుతూ మోసం చేస్తున్న యువతుల ఆట కట్టించారు యూపీ పోలీసులు. ఘజియాబాద్కు చెందిన ఓ వ్యాపారిని ముగ్గురు యువతులు కలిసి స్నేహం పేరుతో దోచుకున్న ఘటన వెలుగుచూసింది. బికనీర్కు చెందిన 25 సంవత్సరాల విజయలక్ష్మి, 21 సంవత్సరాల వయసున్న కృష్ణ అక్కాచెల్లెలు. వీరిద్దరూ కలిసి బులంద్షహర్కు చెందిన తమ దూరపు చుట్టమైన 27 సంవత్సరాల వితంతువు సునీతతో జట్టు కట్టి మోసాలకు పాల్పడుతున్నారు.
ఆ క్రమంలో ఓ వ్యాపారిని నిలువుదోపిడీ చేశారు. స్నేహం ముసుగులో అతడిని నమ్మించి నట్టేటముంచారు. ఏవేవో మాయమాటలు చెప్పి ఓ హోటల్కు రప్పించిన సదరు వ్యాపారికి ఫుల్లుగా మందు పోశారు. ముగ్గురితో ఎంజాయ్ చేద్దామని భావించిన ఆ వ్యాపారి పూటుగా మందేసి మత్తులోకి జారిపోయాడు. అదే అదనుగా ఆ ముగ్గురు యువతులు తమ మోసాలకు తెర లేపారు.
వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!
సదరు వ్యాపారి మత్తులో ఉండగానే అతడి నుంచి రెండు ఫోన్లు, రెండు వాచీలు, కారు కాగితాలు తదితర వస్తువులు కాజేశారు. అనంతరం అతడి బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు 46 వేల రూపాయలు తమ అకౌంట్లలోకి మళ్లించుకున్నారు. అయితే ఆ వ్యాపారి ఖాతాలకు సంబంధించి పిన్ నెంబర్లు అతడి నోటి నుంచే రాబట్టడం గమనార్హం.
దోపిడీ పర్వం ముగిసిన తర్వాత ఆ ముగ్గురు యువతులు దర్జాగా క్యాబ్ బుక్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే మత్తు దిగిన తర్వాత సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారు నివాసముండే అపార్టుమెంట్పై దాడి చేసి ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇలా ఇదివరకు చాలామందిని మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. అంతేగాదు పబ్బులకు సైతం ఏవో నకిలీ ఐడీ కార్డులు చూపించి ఎలాంటి రుసుం చెల్లించకుండా ఫ్రీగా వెళ్లిపోయేవారట. అయితే వీరు ఇంకా ఎంతమందిని మోసం చేశారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.