టీఎంసీ వర్సెస్ బీజేపీ : ఘర్షణలో ముగ్గురికి గాయాలు, 144 సెక్షన్ విధించిన ఈసీ
కూచ్బెహర్ : ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బెంగాల్లో భారీ బలగాలను మొహరించారు. అయినా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కూచ్బెహర్లోని సితల్ ప్రాంతంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన బెంగాల్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.
బీజేపీ వర్సెస్ టీఎంసీ
సీతల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో .. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరితోపాటు షాపు నిర్వహిస్తోన్న ఓ బీజేపీ కార్యకర్త కూడా గాయపడ్డారు. సీతల్లో హింస చెలరేగడానికి టీఎంసీ కారణమని బీజేపీ ఆరోపిస్తుండగా .. టీఎంసీ తిప్పికొట్టింది. మరో రెండురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో బెంగాల్లో ఘర్షణ ఆందోళనకు గురిచేస్తోంది.
అలర్టైన ఈసీ ..
ఎన్నికల సంఘం అలర్టైంది. రాష్ట్రంలోని భాట్పర, ఉత్తర 24 పరగణ జిల్లాలో భారీ బలగాలను మొహరించారు. ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో కూడా హింస చెలరేగింది. అయితే మరోసారి ఇక్కడ ఏమైనా ఘర్షణ జరిగే అవకాశం ఉందనే అంచనాలతో ముందుజాగ్రత్త చర్య తీసుకున్నారు. భాట్పరలో 144 సెక్షన్ విధించినట్టు కోల్కతా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆదివారం జరిగిన హింసపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో 144 సెక్షన్ విధిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దని స్పష్టంచేశారు. అలా ఉంటే భద్రతాదళాలు అదుపులోకి తీసుకుంటాయని వివరించారు.
ఫిర్యాదు ...
మరోవైపు భాట్పర నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి మదన్ మిత్రా సోమవారం ఈసీని కలిశాడు. తనను పట్టణంలోకి రానీయకుండా బీజేపీ నేత అర్జున్ సింగ్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు స్థానికులు కూడా రైల్వేస్టేషన్ ముట్టడించి .. బయటివారిని ఎవరినీ రానీయలేదు. దీంతో అక్కడ రైల్వే పోలీసు ఫోర్స్ పర్సనల్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మొహరించారు.