అంతరిక్షంలోకి ముగ్గరు భారతీయలు...ఇందుకు బడ్జెట్ ఎంతో తెలుసా..?
అంతరిక్ష రంగంలో మరో ఘనతను సాధించేందుకు భారత్ రగంసిద్ధం చేస్తోంది. 2022వ సంవత్సరం నాటికి అంతరిక్షంలోకి ముగ్గురు భారతీయులను పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం రూ. 10వేల కోట్లు బడ్జెట్ను కేటాయించింది. అంతరిక్షంలో ఈ ముగ్గురు భారతీయ వ్యోమగాములు ఏడు రోజులు ఉండనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న గగన్యాన్ అంతరిక్ష విమానంలో వీరు బయలుదేరి వెళతారని కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే అంతరిక్షంలోకి మానవుడిని పంపిన నాలుగవ దేశంగా భారత్ చరిత్రలో నిలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే వారి దేశం నుంచి మానవుడిని అంతరిక్షంలోకి పంపాయి.
గగన్యాన్ ప్రాజెక్టు పై 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రకటన చేశారు. 2019 ఎన్నికల ముందు చివరి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేయడం విశేషం. ఇదిలా ఉంటే గగన్ యాన్ ప్రాజెక్టుకు చాలా తక్కువ సమయమే ఉందని కానీ ప్రధాని మోడీ విధించిన గడువులోగే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ఇస్రో ఛైర్మెన్ కె.శివన్ తెలిపారు. ఇది కేవలం ఇస్రోకు మాత్రమే సవాలు కాదని దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం అని దీన్ని కచ్చితంగా విజయవంతం చేస్తామని శివన్ అన్నారు.
ఇక గగన్యాన్ ప్రాజెక్టు కంటే ముందు రెండు మానవరహిత ప్రాజెక్టులు ఇస్రో పూర్తి చేయాల్సి ఉందని శివన్ చెప్పారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ -III ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతామని శివన్ వివరించారు. ఇక గగన్యాన్ ప్రాజెక్టుపై మాట్లాడిన శివన్... ఇప్పటికే మానవుని పంపేందుకు కావాల్సిన టెక్నాలజీని రూపొందించామని, వాతావరణం నియంత్రణ, లైఫ్ సపోర్ట్ వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును ఆస్ట్రోనాట్స్ వ్యోమనాట్స్ అనే నామకరణం చేసే యోచనలో ఉంది. వ్యోమ్ అంటే సంస్కృతంలో అంతరిక్షం అని అర్థం.