దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్ రేపే .. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న దేశవ్యాప్త కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ లో మొదటిరోజు సుమారు మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ షాట్లు ఇవ్వనున్నట్లు గా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశంలోని 2934 వ్యాక్సిన్ కేంద్రాలలో రేపటినుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది.
ప్రధాని నరేంద్రమోడీ కరోనా నివారణ కోసం పెద్దఎత్తున ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు .
కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న కేజ్రీవాల్ .. దేశమంతా ఉచితంగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
రేపే కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం ... ప్రారంభించనున్న మోడీ
ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ కార్యకర్తలుగా కరోనా వైరస్ పై పోరాటంలో ముందువరుసలో ఉండి సేవలందించిన వారికి మొదటి ప్రాధాన్యత గా వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి . రేపటి నుంచి నిర్వహించనున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి కేంద్రంలో వందమందికి టీకాలు ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీని భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే పదమూడు ప్రాంతాలకు చేరిన కరోనా వ్యాక్సిన్ ను ఒక క్రమపద్ధతిలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవ్వాల్సిన డోసుల కంటే అదనంగా 10% టీకా డోసులు
ప్రతి కేంద్రంలో నిర్దేశించుకున్న టీకాల సంఖ్య కంటే ఎక్కువ కాకుండా ఉండే విధంగా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇక వ్యాక్సినేషన్ కోసం ఇవ్వాల్సిన డోసుల కంటే అదనంగా 10% అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నిర్దేశిత విధానంలో టీకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పేర్కొంది.
టీకా తీసుకోవటంలో లబ్దిదారులకు నో ఆప్షన్
దేశంలో అత్యవసర వినియోగం కింద కోవ్యాక్సిన్ ను , కోవిషీల్డ్ టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం ప్రస్తుతం ఏ టీకా తీసుకోవాలి అనే ఆప్షన్ లబ్ధిదారులకు ఉండదు అనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది . తొలి దశలో భాగంగా కోటిమందికి టీకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, ఇప్పటికే వీటికి కావలసిన 1.65 కోట్లు డోస్ లను ప్రభుత్వం సేకరించింది. వీటిలో 1.11 కోట్ల డోసులు కోవిషీల్డ్ టీకాలు కాగా, 55 లక్షల డోసులు భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాక్సిన్ టీకాలను తీసుకుంది.
ఆరోగ్య కార్యకర్తలకు టీకాల ఖర్చు భరించేది ప్రభుత్వమే
మొదటి ఒక కోటి ఆరోగ్య కార్యకర్తలకు, రెండు కోట్ల మంది ఫ్రంట్లైన్ కార్యకర్తలకు, ఆపై 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, ఆ తర్వాత 50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి టీకాలు అందించబడతాయి. హెల్త్ కేర్ మరియు ఫ్రంట్లైన్ కార్మికులకు టీకాలు వేసే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.