బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 6.5 లక్షల కొత్త ఓటర్లను ఎన్రోల్ చేసింది. ఇందులో 3 లక్షల మంది వరకు కరోనా లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. వచ్చే అక్టోబర్-నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఓటర్లు తమ పేర్లను ఆన్లైన్ లేదా భౌతికంగా నమోదు చేసుకుంటున్నారు. 'మా అంచనా ప్రకారం కరోనా లాక్డౌన్ కారణంగా సుమారు 30 లక్షలకుపైగా వలస కూలీలు తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో 10-12 శాతం మందికి ఓటర్ కార్డులు లేవు. వీరిలో సుమారు 3 లక్షల మందికిపైగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు' అని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
మరో ఈసీ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలకు చెందిన వలస కూలీలు 85-87శాతం వరకు మంది ఓటర్ కార్డులను కలిగివున్నారని తెలిపారు. అయితే, వీరంతా ఇతర రాష్ట్రాల్లో పనుల నిమిత్తం వెళ్లి ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని చెప్పారు.
లాక్డౌన్ తర్వాత భారీ సంఖ్యలో తమ సొంత గ్రామాలకు చేరుకున్న వలస కూలీలు అక్కడే ఉంటున్నారని, ఈ క్రమంలోనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత వచ్చే వారాల్లో తాజా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.
Recommended Video
ఫిబ్రవరి 7, 2020లో విడుదలైన ఎలక్టోరల్ రోల్స్ ఫైనల్ పబ్లికేషన్ ప్రకారం.. బీహార్ రాష్ట్రంలో 7,18,22,450 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,79,12,127 మంది పురుషులు, 3,39,07,979 మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ 2,344. మంది ఉన్నారు. ఓటర్ల జాబితాను సవరించే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని బీహార్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రంజిత తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా నేతృత్వంలో ఎన్నికల అధికారుల బృందం పనులను త్వరలో ప్రారంభించనుంది. కాగా, అదనంగా చేరిన కొత్త ఓటర్లు ఎవరికి ఏ పార్టీకి కలిసివస్తాయో ఇప్పుడు ఆసక్తిగా మారింది.