లాక్ డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై నిలిచిపోయిన ట్రక్కులెన్ని.. వాటిల్లో ఉన్న గూడ్స్ విలువెంత?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్తో చాలావరకు గూడ్స్ వాహనాలు రోడ్ల పైనే నిలిచిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో.. చాలావరకు లారీలు, ట్రక్కులు,డీసీఎంల డ్రైవర్లు వాహనాలను రోడ్ల పైనే వదిలేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో వాటిని గమ్య స్థానాలకు చేర్చడం యజమానులకు తలకుమించిన భారమై కూర్చుంది. కొన్ని వాహనాలు గమ్య స్థానాలకు చేరినప్పటికీ.. అన్లోడ్ చేసేందుకు హమాలీలు లేక గూడ్స్ వాహనాల్లోనే ఉండిపోయింది.
నిలిచిపోయిన వాహనాలెన్ని.. అందులో గూడ్స్ విలువెంత..
దేశవ్యాప్తంగా దాదాపు 3లక్షల ట్రక్కుల్లో దాదాపు రూ.35వేల కోట్ల విలువ చేసే గూడ్స్ రోడ్ల పైనే నిలిచిపోయినట్టు వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ప్రకటించడంతో.. చాలామంది డ్రైవర్లను వాహనాలను మార్గమధ్యలోనే వదిలేసి స్వస్థలాలకు వెళ్లిపోయారని యజమానులు చెబుతున్నారు. వాటిని గమ్య స్థానాలకు చేర్చాలంటే 3-4 రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో డ్రైవర్లు ఆ రిస్క్ తీసుకోలేక.. చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు. తమ వాహనాల్లో కొన్ని ఫ్యాక్టరీల బయటే ఉండిపోయాయని.. అన్లోడ్ చేసేందుకు హమాలీ కూలీలు లేక గూడ్స్ అందులోనే ఉండిపోయిందని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుల్తారన్ సింగ్ వెల్లడించారు.
ఆ వాహనాల్లో ఏమున్నాయి..
లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో అత్యవసర వస్తువుల రవాణాకు మాత్రమే కేంద్రం మొదట అనుమతినిచ్చింది. అయితే ఆ తర్వాత మరికొన్నింటికి కూడా సడలింపునిచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమవడంతో ట్రక్కులను రోడ్ల పైనే వదిలేసి డ్రైవర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు. రోడ్లపై నిలిచిపోయిన ట్రక్కుల్లో.. కార్లు,బైక్స్,ఫ్రిడ్జిలు,ఏసీలు,వాషింగ్ మెషీన్స్,పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులు.. అన్నీ అందులోనే ఉండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్లో ట్రక్కులన్నీ వరుసగా రోడ్డు పక్కన పార్క్ చేసి కనిపిస్తున్నాయి.
Recommended Video
కొంతమంది గమ్య స్థానాలకు చేర్చినప్పటికీ..
కొంతమంది ట్రక్కు డ్రైవర్లు మాత్రం గూడ్స్ అన్లోడ్ చేశాకే వెళ్లాలనే నిర్ణయించుకున్నప్పటికీ.. తీరా గమ్యస్థానాలకు చేరాక ఆర్డర్స్ తిరస్కరించడంతో వాళ్లు ట్రక్కుల్లోనే చిక్కుకుపోయారు. జంషెడ్పూర్ నుంచి రూ.11లక్షల లోడ్తో మార్చి 9న ఫరీదాబాద్కు బయలుదేరిన రామ్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్.. అక్కడి యజమాని గూడ్స్ ఆర్డర్ తిరస్కరించడంతో 15 రోజులుగా ఫరీదాబాద్లోనే చిక్కుకుపోయాడు. సురేష్ శర్మ అనే ఓ ట్రక్కు కంపెనీ యజమాని మాట్లాడుతూ... తమ సంస్థకు చెందిన 500 ట్రక్కుల్లో 400 ట్రక్కులు మార్గమధ్యలోనే నిలిచిపోయాయని చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్లతో కాంటాక్ట్ కూడా లేకుండా పోయిందని... వాహనాలు ఎక్కడ ఆగిపోయాయో కూడా తెలియడం లేదని వాపోయారు.