కశ్మీర్లో మరో ఎన్కౌంటర్: ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం..
జమ్ము కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లను భారత సైన్యం మట్టుబెట్టింది.
కశ్మీర్: జమ్ము కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ జవాను కూడా గాయపడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఉత్తర కశ్మీర్ లోని అమర్ఘర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
'పోలీసులు, సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు' అని మనోజ్ పండిత అనే పోలీస్ అధికారి తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి మందుగుండు, ఆయుధ సామాగ్రి, మూడు రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాల్పుల సమయంలో ఒక కానిస్టేబుల్ గాయపడగా.. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.