ఉగ్ర ఘాతుకం: కాల్పుల్లో ముగ్గురు బీజేపీ నేతలు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి దారుణానికి తెగబడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తలపై కాల్పులు జరిపారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న బీజేపీ నేతలపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో బీజేపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వైకే పొరాకు చెందిన ఫైదా హుస్సేన్ యాతో, ఉమర్ రంజాన్, సోపాట్ దేవసర్కు చెందిన ఉమర్ రషీద్ బేగ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Jammu and Kashmir: Three BJP workers identified as Fida Hussain Yatoo, Umer Rashid Beigh & Umer Ramzan Hajam succumbed to bullet injuries after terrorists fired upon them in YK Pora, Kulgam, today. pic.twitter.com/XccmRBK1ts
— ANI (@ANI) October 29, 2020
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీసులతోపాటు భారత సైనికులు తనిఖీలు చేపట్టారు. కాగా, గత కొద్ది నెలలుగా భారతీయ జనతా పార్టీ నేతలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దాడిలో పదుల సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
మరో ఘటనలో, నిల్డూరా గ్రామంలో జమ్మూ కాశ్మీర్లోని షోపియన్లో మరో యువకుడిని ఉగ్రవాదులు కాల్చి గాయపరిచారు. బాధితురాలికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు.