తమిళనాడులో ముగ్గురు వైద్య విద్యార్థినుల ఆత్మహత్య
చెన్నై: దేశ వ్యాప్తంగా రోహిత్ వేముల ఆత్మహత్యపై ఉద్రిక్తత కొనసాగుతుండగానే తమిళనాడులో శనివారం రాత్రి ముగ్గురు వైద్య విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మోనిషా, ప్రియాంక, శరణ్యలు అనే విద్యార్ధినిలు విల్లుపురం జిల్లా కుల్లకురుచిలోని ప్రైవేట్ విద్యాసంస్థ ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ ఆఫ్ న్యూరోపతి అండ్ యోగా సైన్సెస్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నారు.
కాలేజీలో కనీస మౌలిక సదుపాయలు లేవని ఈ ముగ్గురు కాలేజీకి సమీపంలోని ఓ బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు కాలేజీ యాజమాన్యమే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించారు. కాలేజీలో కనీస వసతలు లేవని వీరు యాజమాన్యాన్ని నిలదీసినట్లుగా అందులో పేర్కొన్నారు.
విద్యార్థినులు శరణ్య, ప్రియాంక, మనీషా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. విద్యార్థినులు చనిపోయే ముందు ఆత్మహత్య లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు చనిపోయినట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీ చైర్మన్ కొడుకు సోకర్ వర్మను అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్ధినుల తల్లిదండ్రులు తమ కూతుళ్లది హత్యే అని ఆరోపిస్తున్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. తమ పిల్లలు కాలేజీ బాగాలేదని చెప్తే వేరే కాలేజీకి మార్చేవాళ్లమని వారు మీడియాతో తెలిపారు. ఎవరో తమ పిల్లలను హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. కాగా, హెచ్సీయూలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే తమిళనాడులో ముగ్గురు వైద్య విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.