తమిళనాడు సీఎం VS దినకరన్: ముగ్గురు మంత్రుల అరెస్టు కు రంగం సిద్దం !
ఐటీ దాడులకు గురైన మంత్రి విజయభాస్కర్ విషయంలో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, టీటీవీ దినకరన్ మధ్య గొడవ మొదలైయ్యింది. మరో పక్క ముగ్గురు తమిళనాడు మంత్రులను అరెస్టు చెయ్యడానికి చెన్నై పోలీసులు సిద్దం అయ్
చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారిణిని బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ ల మీద కేసు నమోదు చేసిన చెన్నై నగర పోలీసులు వారిని అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మంత్రి విజయభాస్కర్ ఇంటిలో సోదాలు చెయ్యరాదని ఓ మహిళా ఆదాయపన్ను శాఖ అధికారిని ఈ ముగ్గురు మంత్రులు బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రుల మీద ఫిర్యాదు చేసిన ఐటీ శాఖ
మహిళా అధికారిణిని బెదిరించారని ఆరోపిస్తూ ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారులు చెన్నై నగర పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆదాయపన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.
విచారణ అధికారిగా శంకర్
మంత్రులపై ఫిర్యాదులు రావడంతో చెన్నై నగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ నివేదికను పై అధికారులకు అప్పగించారు. ఇప్పటికే మంత్రులపై నమోదు అయిన కేసు విషయంపై న్యాయనిపుణలతో చర్చించారు.
అనుమతి కోసం ఎదురుచూపులు
మంత్రులను అరెస్టు చెయ్యాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అలాగే అసెంబ్లీ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని తెలిసింది. మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ లను పోలీసులు అరెస్టు చేస్తారని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీఎం పళనిసామి VS టీవీవీ దినకరన్
ఐటీ దాడులకు గురైన విజయభాస్కర్ ను తప్పించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారు. సీనియర్ మంత్రులు జయకుమార్, వేలుమణి, సీవీ షణ్ముగం, తంగమణి సీఎంకు మద్దతు పలికారు. అయితే టీవీవీ దినకరన్ మాత్రం విజయభాస్కర్ ను క్యాబినేట్ నుంచి తొలగించరాదని సీఎంతో గొడవపెట్టుకున్నారని సమాచారం.
గవర్నర్ ఆమోదం కోసం
విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఎడప్పాడి పళనిసామి గవర్నర్ విద్యాసాగర్ రావుతో సంప్రదించడానికి సిద్దం అయ్యారని సమాచారం. ఇదే సమయంలో పోలీసులు సైతం మరో ముగ్గురు మంత్రులను అరెస్టు చెయ్యడానికి సిద్దం అయ్యారు.
చెట్టు ఎక్కి కుర్చున్న టీవీవీ దినకరన్
శుక్రవారం రాత్రి లోక్ సభ ఉప సభాపతి తంబిదురై, తమిళనాడు మంత్రులు దిండుగల్లు శ్రీనివాస్, రాజ్యలక్ష్మి తదితరులు టీటీవీ దినకరన్ తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో విజయభాస్కర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడానికి వీలులేదని దినకరన్ తేల్చి చెప్పారని సమాచారం.
గవర్నర్ హామీ ఇచ్చారు
ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ మీద చర్యలు తీసుకుంటామని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హామీ ఇచ్చారని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, టీవీవీ దినకరన్ ల మధ్య వివాదం మొదలైయ్యిందని శశికళ వర్గంలోని నాయకులే అంటున్నారు.