ప్రతీ 10 మంది వలస కార్మికుల్లో ముగ్గురు.. పల్లెలకు వైరస్ను మోసుకెళ్లే ఛాన్స్?
ఢిల్లీ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వేలాదిమంది వలస కార్మికులకు సరైన వసతులు కల్పించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మంగళవారం(మార్చి 31) ఉదయం 11గంటల వరకు రోడ్లపై ఒక్క వలస కార్మికుడు కూడా లేరని స్పష్టం చేశారు. వాళ్లందరినీ సమీపంలోని ప్రభుత్వ షెల్టర్స్కు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి.. ప్రస్తుత పరిస్థితులపై కూడా సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి పలు విషయాలు వెల్లడించారు.
చాలా దేశాల కంటే ముందే చర్యలు చేపట్టామన్న ప్రభుత్వం
జనవరి 5,2020న మొదటిసారి కోవిడ్-19 గురించి సమాచారం బయటకు వచ్చిందన్నారు సొలిసిటర్ జనరల్. కరోనా నియంత్రణ చర్యలకు జనవరి 17,2020 నుంచి ప్రభుత్వం సన్నద్దమైందన్నారు. ఇప్పటివరకు అనుకున్నదాని కంటే ఎక్కువగానే వైరస్ను నియంత్రించగలిగామని.. చాలా దేశాల కంటే ముందుగానే మన దేశంలో నియంత్రణ చర్యలు మొదలుపెట్టడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకముందే విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టామన్నారు. చాలా దేశాలు ఆలస్యంగా థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టాయని.. అక్కడితో పోలిస్తే మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు.
విదేశాల నుంచి వచ్చినవారికి ఎన్ని స్క్రీనింగ్ టెస్టులు..
విమానాశ్రయాల్లో మొత్తం 15.5లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామన్నారు. అలా ఓడ రేవుల్లో 12 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్టు తెలిపారు. మొత్తం 3.48లక్షల మందిని 28 రోజుల పాటు మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా వాట్సాప్,ఫేస్బుక్,ట్విట్టర్,టిక్టాక్లో కరోనా వ్యాప్తిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సుప్రీం ప్రస్తావించింది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని.. త్వరలోనే పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలు తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే టీవీ చానెళ్ల ద్వారా కూడా ప్రచారం నిర్వహించాలని సుప్రీం సూచించింది.
వలస కార్మికుల్లో.. ప్రతీ 10మందిలో ముగ్గురు వైరస్ను మోసుకెళ్లే ఛాన్స్..
ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలెవరూ కరోనా బారిన పడలేదని సొలిసిటర్ జనరల్ సుప్రీంకు తెలిపారు. గత లెక్కల ప్రకారం.. దేశంలో 4.14కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని చెప్పారు. కానీ కరోనా వైరస్ భయంతో తిరిగి పల్లెలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. లాక్ డౌన్ పీరియడ్లో వలసల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్తున్న ప్రతీ 10 మందిలో ముగ్గురు కరోనా వైరస్ను మోసుకెళ్లే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం.