అధికారం, కాంగ్రెస్, జేడీఎస్ కు మూడు చాన్స్ లు, సుప్రీం కోర్టుకు పోతాం, గవర్నర్ బీజేపీ మనిషి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుబాయ్ వాలాకు పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ముందు మాకు అవకాశం ఇవ్వాలంటే లేదు ముందు మాకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ వాజుబాయ్ వాలా మీద మూడు పార్టీల నాయకులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ , జేడీఎస్ కు మూడు చాన్స్ లు మాత్రమే ఉన్నాయి. గవర్నర్ బీజేపీ మనిషి అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బీజేపీకి చాన్స్ ఇచ్చారు
104 సీట్లు (ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో 106) ఉన్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి గవర్నర్ వాజుబాయ్ వాలా అవకాశం ఇచ్చారని, వాళ్లకు పూర్తి మెజారిటీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ నాయకులు మాకు మొదటి అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు ఇంతకు ముందే మనవి చేశారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతులేదని, కాంగ్రెస్, జేడీఎస్ మిత్రపక్షాలకు సంపూర్ణ మెజారిటీ ఉందని, మాకే మొదట అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వాజుబాయ్ వాలాను డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు
బీజేపీకి 104 సీట్లు ఉన్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇంకా ఆరు మంది ఎమ్మెల్యేలు (222 నియోజక వర్గాల ప్రకారం) కావాలి. కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్ 38 స్థానాలు కలుపుకుంటే (78+38) 116 ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. అందువలన మాకే మొదట ప్రధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు రాజ్ భవన్ ముందు తిష్టవేశారు.
గవర్నర్ బీజేపీ వ్యక్తి
కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా పక్కా బీజేపీ నాయకుడు కావడంతో మొదట బీఎస్. యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్ తమకు ప్రాధన్యత ఇవ్వకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదని, మా మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యింది. అయితే సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అవకాశం చాల తక్కువగా ఉంది. గతంలో బోమ్మాయ్ కేసులో అతి పెద్ద పార్టీ (ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ)కి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
మరో రెండు చాన్స్ లు
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైతే మరో రెండు అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ వాజుబాయ్ వాలా ముందు పెరేడ్ నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని మనవి చెయ్యడం. అందుకూ గవర్నర్ అవకాశం ఇవ్వకుంటే రాష్ట్రపతి ముందు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు పెరేడ్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని మనవి చెయ్యడం. అంతలోపు బీజేపీ తన మెజారిటీ నిరూపించుకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సినిమా చూడటం తప్పా ఏమీ చేయ్యలేవు.