ఉల్లంఘన: ఎన్కౌంటర్లో ముగ్గురు పాక్ సైనికులు హతం
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడటంతో భారత సైన్యం దీటుగా స్పందించింది. భారత్, పాక్ సైన్యం మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు ముగ్గురు పాకిస్థాన్ నికులు హతమయ్యారు. భారత పోస్టులు, స్థానిక ప్రజలే లక్ష్యంగా పాక్ సైన్యం మంగళవారం రెండు చోట్ల కాల్పులకు తెగబడింది.
రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్లో పాకిస్థాన్ కాల్పులకు పాల్పడటంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు. అంతర్జాతీయ సరిహద్దులోని ఆర్ఎస్ పురా సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు స్థానిక మహిళలు గాయపడ్డారు.
ఈ ఘటనలపై అధికార వర్గాలు మాట్లాడుతూ.. పాక్ సైన్యం మోర్టార్ బాంబులు, తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడిందని, తాము కూడా ధీటుగా సమాధానమిచ్చామని చెప్పాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందినట్టు తమకు సమాచారముందని తెలిపాయి.
ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నాయి. భారత్ లక్షిత దాడులు చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్ 40 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్టు వివరించాయి. మరోవైపు భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ పాకిస్థాన్లోని భారత రాయబారికి పాక్ సమన్లు జారీ చేయడం గమనార్హం.