కూతురిని చంపేసి, భార్యతో కలిసి ఆత్మహత్య
బెంగళూరు: ఆర్థిక సమస్యల కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన కర్ణాటకలోని హాసన్ లో జరిగింది. కుమార్తెను హత్య చేసిన వడ్డి వ్యాపారి కట్టుకున్న భార్యతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హాసన్ పట్టణంలో జై శంకర్ (35), తరుణ అలియాస్ అరుణ (32) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భూమిక (11) అనే కుమార్తె ఉంది. జై శంకర్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని దగ్గర అనేక మంది రుణం తీసుకున్నారు.
అదే విధంగా జై శంకర్ కు రూ. 18 లక్షల అప్పు ఉందని తెలిసింది. రుణం తీసుకున్న వారు సరైన సమయంలో చెల్లించకపోవడంతో జై శంకర్ ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో అప్పు ఇచ్చిన వారు జై శంకర్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తడి తీసుకు వచ్చారు.
ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో జై శంకర్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం నిద్ర పోతున్న కుమార్తె భూమిక గొంతు బిగించి హత్య చేశారు. తరువాత భార్యతో కలిసి జై శంకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మద్యాహ్నం విషయం వెలుగు చూసింది.