పెళ్లి బట్టలు తీసుకుని వస్తూ వధువు సహా తల్లిదండ్రులు మృతి
బెంగళూరు: పెళ్లి బట్టలు తీసుకు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. పెళ్లి బట్టలు మొత్తం రక్తపుమరకలు అయ్యి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి.
చిక్కమగళూరులో కృష్ణప్ప (60), శారదమ్మ (48) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె లావణ్య (26). లావణ్య వివాహం నిశ్చయం అయ్యింది. మే 16వ తేదిన చిక్కమగళూరులో వైభవంగా లావణ్య వివాహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటివల కృష్ణప్ప, శారదమ్మ దంపతులు కుమార్తె లావణ్యను పిలుచుకుని బెంగళూరు వచ్చారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న బంధువులకు వివాహ పత్రికలు పంచిపెట్టారు. పెళ్లికి కావాలసిన పట్టుచీరలు, బట్టలు తీసుకున్నారు. సోమవారం రాత్రి కారులో చిక్కమగళూరు బయలుదేరారు.
మార్గం మద్యలో మంగళవారం వేకువ జామున 2 గంటల సమయంలో మూడిగెరె తాలుకా గోణిబీడు సమీపంలో మంగళూరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సు వీరి కారును డీకొనింది. ఈ ప్రమాదంలో కృష్ణప్ప, శారదమ్మ దంపతులతో పాటు పెళ్లి కుమార్తె లావణ్య సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
కారు డ్రైవర్ సందీప్ కు తీవ్రగాయాలు కావడంతో మూడిగెరె ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బనకల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కుమార్తెతో పాటు ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి. బస్సు డ్రైవర్ బసవరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.