దుండగుల భీభత్సం: ముగ్గురు దొంగలు అంతం
భోపాల్: మధ్యప్రదేశ్ లో దొంగలు రెచ్చిపోవడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ముగ్గురు దొంగలను పట్టుకుని చితకబాది దారుణంగా చంపేశారు. మధ్యప్రదేశ్ లోని మాందాపూర్ గ్రామంలో ఆదివారం అర్దరాత్రి చోరీకి ప్రయత్నించిన దొంగలను గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
తమను అడ్డుకుంటున్నారని సహనం కొల్పోయిన దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బాలుడితో సహ ఐదు మందికి తీవ్రగాయాలైనాయి. ఈ సమయంలో దిక్కుతోచని గ్రామస్తులు ముగ్గురు దొంగలను పట్టుకుని అక్కడికక్కడే దారుణంగా కొట్టి చంపేశారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దొంగలు చోరీ చెయ్యడానికి ప్రయత్నించి గ్రామస్తుల మీద కాల్పులు జరిపారని, అందుకే ఇంత జరిగిందని జిల్లా ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు.
గ్రామస్తుల మీద దుండగులు కాల్పులు జరపడం, అందులో ఓ చిన్నారి ఉండటంతో గ్రామస్తులు సహనం కొల్పోయారని మనోజ్ శర్మ వివరించారు. దుండగులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గాయాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు.