చైనా బరితెగింపు.. 45 ఏళ్ల శాంతి బద్దలు.. ఆర్మీ బలగాల హత్యలపై బుకాయింపు.. ఇండియాదే తప్పంటూ..
''హిందీ-చీనీ భాయి-భాయి''నినాదం బద్దలైపోయింది. 45 ఏళ్లలో తొలిసారి భారత్-చైనా సరిహద్దులో నెత్తుటిపాతం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లను డ్రాగన్ బలగాలు అతికిరాతకంగా చంపేశాయి. చైనా వైపు కూడా మరణాలు లేదా గాయాలు అయిఉండొచ్చని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. తద్వారా జనాభా, సైనిక, అణ్వాయుధ సంపత్తి పరంగా ప్రపంచంలోనే రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య శాంతి అధ్యాయం ముగిసినట్లయింది. భారతీయుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన ఈ సంఘటనపై చైనా అప్పుడే బుకాయింపు మొదలుపెట్టింది.
Recommended Video
అసలేం జరిగిందంటే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గత 45 రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతున్నది. సరిహద్దుకు సమీపంలో భారత్ రోడ్లు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తోన్న చైనా.. తూర్పు లదాక్ లోని మూడు కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి.. భారత సైన్యంపై కవ్వింపులకు దిగింది. టెన్షన్ పెరిగిపోయిన దరిమిలా లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయిలో జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో గత వారం రోజుల నుంచి రెండు వైపులా బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే గడిచిన రెండ్రోజులుగా అక్కడ సీన్ మళ్లీ మారిపోయింది..
కమాండర్ల చర్చల వేళ..
వారం రోజులుగా దూకుడు తగ్గించుకున్న చైనా.. ఉన్నట్టుండి సోమ,మంగళవారాల్లో చైనా సైన్యం మళ్లీ దూకుడు ప్రదర్శిస్తూ భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించింది. మంగళవారం డివిజనల్ కమాండర్ల స్థాయిలో మరోసారి చర్చలు జరగాల్సి ఉండగా.. రెండు దేశాల మధ్య మాటామాటా పెరిగింది. గాల్వాన్ లోయలో రెండు వైపులా గస్తీ కాస్తోన్న సైనికుల మధ్య భయానకరీతిలో కొట్లాట జరిగింది. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. మనవైపు ఓ కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. అయితే..
చైనా రివర్స్ కథనం..
లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత బలగాల మరణాలకు సంబంధించి చైనా రివర్స్ కథనాలను వండివార్చుతోంది. తప్పంతా ఇండియాదే అని, చైనా భూభాగంలోకి ఇండియన్ ఆర్మీ చొరబాటుకు ప్రయత్నించిందని, వాళ్లను అడ్డుకునే క్రమంలోనే తోపులాట చోటుచేసుకుందని బీజింగ్ అధికార వర్గాలు ప్రకటన చేశాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి అప్పటికప్పుడు మీడియాకు స్టేట్మెంట్లు విడుదల చేశారు.
ఏకపక్ష చర్యలు వద్దు..
గాల్వాన్ లోయలో దాష్టీకానికి పాల్పడిన చైనా.. తాను ఏ తప్పూ చేయలేదని ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇండియాతో తాము శాంతినే కోరుతున్నామని, ఎప్పటికీ శాంతికే కట్టుబడి ఉంటామని, భారత్ ఏకపక్షంగా చర్యలకు దిగాలనుకోవడం సరికాదని, సరిహద్దులో ఆక్రమణలు సబబు కాదని, ఇప్పటికీ శాంతి చర్చలకే కట్టుబడి ఉన్నామంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వరుస ప్రకటనలు చేసింది. భారత జవాన్ల మరణాల గురించి తనకు తెలియదని విదేశాంగ శాఖ చెప్పడం గమనార్హం. ఎల్ఏసీలో జవాన్ల మరణాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుటాహుటిన అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. రాబోయే కొద్ది గంటలు రెండు దేశాలకు సంబంధించి కీలకం కానున్నాయి..
తుపాకులు వాడలేదు..
నిజానికి 1962 యుద్ధం తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లో ఒక్క తుపాకి గుండు కూడా పేలలేదు. 1975 తర్వాత సరిహద్దులో గొడవల కారణంగా రెండు వైపులా ఏ ఒక్కరూ చనిపోలేదు. గతంలో డోక్లాంలో రెండు దేశాల సైన్యాలు కొట్టుకున్నా.. విషయం మరణాల దాకా వెళ్లలేదు. అలాంటిది 45 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఎల్ఏసీలో రక్తపాతం చోటుచేసుకుంది. మనవైపు ముగ్గురు చనిపోగా.. చైనా వైపు మరణాల సంఖ్య వెల్లడికావాల్సి ఉంది. మంగళవారం నాటి ఘటనలోనూ రెండు వైపుల సైనికులు తుపాకులను మాత్రం వాడలేదని తెలుస్తోంది.