కదులుతున్న రైలులో.. డోర్ దగ్గర నిలబడి.. సెల్ఫీ తీసుకోబోయారు.. ఆ తరువాతే జరిగింది ఘోరం
సెల్ఫీ పిచ్చి ముగ్గరి ప్రాణాలు తీసిన ఉదంతమిది. కదులుతున్న రైలులో.. డోర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.
హౌరా: సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రజల్లో మార్పు మాత్రం రావడంలేదు. ప్రమాదమని తెలిసినా సెల్ఫీ కోసం వింత ఫీట్లు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంన్నారు.
పశ్చిమ్బంగాలో తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హౌరా జిల్లాలో కొందరు విద్యార్థులు కదులుతున్న రైలులో.. అదీ డోర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఓ విద్యార్థి అదుపుతప్పి రైల్లోంచి జారి పట్టాలపై పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో మిగిలిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ స్నేహితుడ్ని వెతకడం కోసం మరో నలుగురు విద్యార్థులు రైలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో కిందకు దూకారు.
వారు ఆందోళనతో పట్టాలపై గాలిస్తూ అదే పట్టాలపై ఎదురుగా వస్తున్న మరో రైలు చూసుకోలేదు. దీంతో అది వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల వారు గమనించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.