అమానుషం : ముగ్గురు మహిళల అర్ధనగ్న ఊరేగింపు.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం రోజురోజుకు పురోగమిస్తోందని ఓవైపు చెప్పుకుంటున్నాం. మరోవైపు అజ్ఞానం,మూఢనమ్మకాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ గ్రామస్తులు ముగ్గురు మహిళలపై మంత్రగత్తెల నెపంతో దాడి చేశారు. వారికి గుండు కొట్టి.. అర్ధనగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు. అంతేకాదు,బలవంతంగా వారితో మూత్రం కూడా తాగించే ప్రయత్నం చేశారు.
అర్ధనగ్నంగా ఊరేగింపు..
ముజఫర్పూర్ జిల్లాలోని హతౌది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దక్రామా గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు గ్రామంలోని ఓ చోట కొన్ని పూజ క్రతువులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో వారిని పట్టుకుని కట్టేశారు. అనంతరం గుండు కొట్టి.. అర్ధనగ్నం మార్చి గ్రామంలో ఊరేగించారు. బలవంతంగా మూత్రం కూడా తాగించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది షాక్కి గురయ్యారు. పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేశారు.
9 మంది అరెస్ట్..
సోమవారం(మే 4) ఈ ఘటన జరిగింది.. ప్రధాన నిందితుడు శ్యామ్ సహానితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఘటనపై గ్రామస్తులు గానీ,బాధితులు గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విచారణలో పూర్తి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Recommended Video
వదిలిపెట్టేది లేదన్న ఏఎస్పీ..
ఘటన తర్వాత బాధిత మహిళల కుటుంబం ఆ గ్రామం నుంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఖండించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సబ్ డివిజనల్ ఆఫీసర్ కుందన్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని అడిషనల్ సూపరింటెండ్ అమితేష్ కుమార్ స్పష్టం చేశారు.