అడ్డం తిరిగిన కథ: మోడీ కోటి ఉద్యోగాల కల్పన హుష్ కాకి!
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఏటా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారు. కానీ 2016 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో కల్పించిన కొలువులు కేవలం 2.31 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. 63 శాతం మంది ప్రజలు మాత్రం దేశంలో నిరుద్యోగ సమస్య ఏమాత్రం తగ్గలేదని పేర్కొంటున్నారు.
2013 నవంబర్ 22వ తేదీన ఆగ్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రస్తుత ప్రధాని నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గెలిపిస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తానని యువకులకు హామీలు గుప్పించారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువుదీరి మూడేళ్లు కావస్తున్నది. కానీ ఉద్యోగాల కల్పన అతిపెద్ద వైఫల్యంగా మిగిలింది. గత ఎనిమిదేళ్లలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించారని ప్రభుత్వ కార్మికశాఖ గణాంకాలే చెప్తున్నాయి.
2009లో కంటే తక్కువే
‘లోకల్ సర్కిల్స్' అనే సిటిజన్ ఎంగేజ్మెంట్ అనే వేదిక నరేంద్ర మోదీ సర్కార్ పనితీరుపై 200 నగరాల పరిధిలో నిర్వహించిన సర్వే అధ్యయనం ప్రకారం 63 శాతం మంది ప్రజలు స్పందిస్తూ ప్రభుత్వోద్యోగాల కల్పన ఫేలవంగా ఉన్నదని తేల్చేశారు. 2015లో 1.55 లక్షల మందికి, 2016లో 2.31 లక్షల మందికి మాత్రమే నరేంద్రమోదీ సర్కార్.. ప్రభుత్వోద్యోగాలు కల్పించింది. 2009లో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కల్పించిన 10 లక్షలకు పైగా ఉద్యోగాలతో పోలిస్తే మోదీ సర్కార్ హయాంలో యువతకు లభించిన ఉద్యోగాలు సగానికంటే తక్కువే.
ఉద్యోగాల కల్పనలో రివర్స్ గేర్
కొత్త ఉద్యోగాల కల్పన సంగతి పక్కన బెడితే 2016లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రంగాలు టెక్స్ టైల్స్, తోలు, లోహాలు, ఆటోమొబైల్, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, రవాణా, ఐటీ, హ్యాండ్లూమ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగంలో 2015లో 19 వేల మంది, హ్యాండ్లూమ్/ పవర్ లూమ్ రంగంలో 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తేలింది.
మూడేళ్లలో ఉద్యోగాలు తగ్గుముఖం
తోలు పరిశ్రమ, ఆటోమొబైల్ రంగాల్లో 8000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో రవాణా రంగంలో నాలుగు వేల మంది ఉద్యోగాలు కొట్టుకుపోయాయి. 2015లో ఐటీ, బీపీవో రంగాల్లో అత్యధికంగా 76 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. టెక్స్ టైల్స్ రంగంలో 72 వేలు, లోహాల రంగంలో 37 వేల ఉద్యోగాలు లభించాయి. సాధారణంగానే మూడేళ్లలో ఉద్యోగాలు తగ్గిపోయాయి.
ఐదు లక్షలకు మించి లభించని ఉద్యోగాలు
ఏటా 1.3 కోట్ల మంది నిరుద్యోగ సంఘంలో చేరిపోతున్నారు. 1980, 1990వ దశకాలతో పెరిగిన జనాభాతో పోలిస్తే 2012 నుంచి ఐదు లక్షలకు మించి ఉద్యోగాలు లభించలేదు. ప్రపంచంలోకెల్లా చైనాను మించి ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న దేశంగా భారత్ చోటు దక్కించుకున్నా.. ఉద్యోగాల కల్పన ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనకు నీతి ఆయోగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది.
నిరుద్యోగులకు ఆటోమేషన్ ముప్పు
తాజాగా ఆటోమేషన్, అమెరికా సహా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులతో భారత ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్తోపాటు ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ తదితర సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధించనున్నాయి. విప్రో ప్రతిభ ఆధారంగా వెయ్యిమందికి పైగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఆరువేల మందికి పైగా ఉద్వాసన పలికింది. ఐటీ రంగంలో వచ్చే రెండు, మూడేళ్లలో వరుసగా ఉద్యోగుల ఉద్వాసనలే ఉంటాయని పరిణామాలు చెప్తున్నాయి. వచ్చే రెండు - మూడేళ్లలో సగటున 1.75 - రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిణామాలు చెప్తున్నాయి.
మోదీ సర్కార్కు ఎదురు దెబ్బ ఇలా
ఉద్యోగాల లేమి ప్రభావంతో దేశీయ జీడీపీపై పడుతుందని మోదీ సర్కార్ భావిస్తున్నది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలని భావిస్తున్ననరేంద్రమోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బేనని అంటున్నారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం ఉద్యోగాల కల్పించడంలో వెనుకబాటు తనం వల్ల ప్రజల మనోభావాలు మారిపోతాయని తేలిపోయింది. గత ఏడాది 43 శాతం మంది ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని సర్వేలో తేలితే ఈ ఏడాది మరో 20 శాతం మంది పెరిగారు.