సర్జికల్ స్ట్రైక్స్ లో చిరుత మూత్రం కీలకం: ఆ మెరుపు దాడులకు మూడేళ్లు!
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ఉదంతం. జమ్మూ కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ వద్ద సరిహద్దులకు అవతల.. పాకిస్తాన్ భూభాగంపై తిష్ఠ వేసిన ఉగ్రవాద శిబిరాలపై మనదేశ ఆర్మీ నిర్వహించిన మెరుపు దాడికి ఆదివారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాల్లో అనేక పరిణామాలకు దారి తీసింది ఈ సర్జికల్ స్ట్రైక్. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులను దాటుకుని వెళ్లి ఉగ్రవాదుల శిబిరాలను ఛిన్నాభిన్నం చేశారు జవాన్లు. సర్జికల్ స్ట్రైక్ చోటు చేసుకున్నట్టు బహిరంగంగా కూడా చెప్పుకోలేకపోయింది పాకిస్తాన్. భారత్ మెరుపుదాడులకు దిగినట్లు చెప్పుకోవాలీ అంటే.. తమ దేశంలో ఉగ్రవాదులు మకాం వేసినట్టు అంగీకరించాల్సి వస్తుంది పాకిస్తాన్ కు. అందుకే- కిక్కురు మనలేదు.
యూరీ సెక్టార్ పై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా..
మనదేశ జవాన్లు ఉద్దేశపూరకంగా చేసిన దాడులు కావవి. దాని వెనుక విషాదకర కారణాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని యూరీ సెక్టార్ సమీపంలో మనదేశ ఆర్మీ పోస్ట్ పై దాడులు చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 18 మంది జవాన్లు అసువులు బాశారు. మరో నలుగురు విదేశీ పర్యాటకులకు ప్రాణాలను కోల్పోయారు. పాకిస్తాన్ ను కేంద్రబిందువుగా చేసుకుని మనదేశంలో నరమేథాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదుల చర్యల పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురయ్యాయి. రాజకీయ వేడి పెరగింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైనా విమర్శలకు దిగాయి. దీనితో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది.
సర్జికల్ స్ట్రైక్ ముందు రోజు..
సర్జికల్ స్ట్రైక్స్ 2016 సెప్టెంబర్ 29న చోటు చేసుకోగా.. దానికి రెండు రోజుల ముందే దేశ రాజధానిలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. రక్షణ శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులు దాటుకుని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయాన్ని తీసుకున్న వెంటనే- పెద్ద ఎత్తున సైనిక బలగాలను యూరీ సెక్టార్ వైపునకు తరలించింది. సుమారు వందిమంది మెరికల్లాంటి జవాన్లను యూరీ సెక్టార్ సరిహద్దుల్లో మోహరింపజేసింది. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేయడంలో ప్రత్యక శిక్షణ పొందిన జవాన్లు వారంతా. సర్జికల్ స్ట్రైక్ బాధ్యతలను ఉధంపూర్ లోని నార్తర్న్ కమాండ్ చేతికి అప్పగించారు.
చిమ్మ చీకట్లో ఉగ్రమూక పీచం అణచిన జవాన్లు..
సెప్టెంబర్ 29వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో జవాన్లు సరిహద్దులను దాటుకున్నారు. పాకిస్తాన్ భూభాగంపై అడుగు పెట్టారు. రాకెట్ లాంచర్లు, చీకట్లో సైతం లక్ష్యాన్ని ఛేధించగల శక్తిమంతమైన రాకెట్లు, అండర్ బ్యారెల్ గ్రెనేడ్లు, వాటి లాంచర్లు తమ వెంట తీసుకెళ్లారు. ఒకేసారి పలు గ్రెనేడ్లను సంధించే సామర్థ్యం ఉన్న మిల్కోర్ లాంచర్ ను సర్జికల్ స్ట్రైక్స్ కోసం వినియోగించారు. 40 ఎంఎం సామర్థ్యం గల గ్రెనేడ్లను ఏకకాలంలో టార్గెట్ పై దూసుకెళ్లడానికి ఉపయోగపడే లాంచర్ అది.
చిరుత మూత్రాన్ని సైతం..
సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా జవాన్లు చిరుత మూత్రాన్ని వినియోగించడం ఆసక్తికరం. పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాల వైపు వెళ్తున్న సమయంలో కుక్కలు అరవకుండా ఉండటానికే దీన్ని తీసుకెళ్లారు జవాన్లు. చిరుత మూత్రం వాసన ఘాటు సోకిన వెంటనే చుట్టు పక్కల ఎక్కడా కుక్కలు ఉండవనే కారణంతో వాటిని తమ వెంట తీసుకెళ్లారు. సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా సుమారు 50 మందికి ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.
తెలిసినా నోరు కుట్టేసుకున్న పాక్..
ఈ విషయం తెలిసినప్పటికీ.. పాకిస్తాన్ నోరు కుట్టేసుకుంది. భారత జవాన్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశారని ధృవీకరించాల్సి వస్తే.. దానికి గల కారణాలను కూడా వివరించాల్సింది పాకిస్తానే. ఎందుకు చేశారు? ఎవరి మీద చేశారు? అనే ప్రశ్నల వల్ల ఉగ్రవాదులు తమ దేశంలో మకాం వేసిన విషయాన్ని అంగీకరించక తప్పదు. ఈ కారణం వల్లే సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్తాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోయింది. ఆ ఘటన చోటు చేసుకున్న రెండున్నరేళ్ల తరువాత జవాన్లు.. బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.