దేశంలో ఈసారి వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవవు: వాతావరణశాఖ
దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే ఒక నెల పూర్తయినప్పటికి కూడా... ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకా మూడు నెలల సమయం ఉన్నందును ఇప్పుడే దీనిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
రుతుపవనాలు దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికంటే 15 రోజులు ముందే ఎంట్రీ ఇచ్చాయి. కానీ వర్షాలు మాత్రం అనుకున్న దానికంటే 4శాతం తక్కువే కురిసినట్లు వెదర డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇప్పటికీ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి నెలరోజులు కావొస్తోందని, ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయనే భావన కలుగుతోందని అన్నారు పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవినంజున్దయ. వర్షాలు తక్కువ స్థాయిలో కురిసినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
అయితే వర్షాలు పడకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు వాతావరణశాఖ అధికారులు. ఇందుకోసం ప్రతిరోజు వాతావరణంలోకి బెలూన్లను పంపించి ఏ రోజుకారోజు రిపోర్ట్ను స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడో వంతు ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పటికే గంగా నది ప్రవహించే ప్రాంతంలో వర్షాలు కురవక అక్కడి రైతులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఓటరుగా ఉన్న రైతుపై ప్రభావం చూపి ప్రభుత్వంకు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ అందించిన గణాంకాలు ప్రకారం చూస్తే... దేశం మొత్తం మీద వర్షాల్లో 4శాతం తగ్గుదల కనిపిస్తోంది. తూర్పు ఈశాన్య భారతంలో 26శాతం తగ్గుదల ఉండగా, మధ్యభారత్ ప్రాంతాల్లో ఒక శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. వాయువ్య భారత దేశంలో వర్షాలు 12శాతం అధికంగానే కురవగా...దక్షిణ భారత దేశంలో 20శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి.