30 మంది ఖైదీలకు కరోనా, ఉలిక్కిపడ్డ సిబ్బంది.. ఏడుగురు ఆస్పత్రికి తరలింపు
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో మిగతా ఖైదీలు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. చెన్నైలో గల ఫుజల్ జైలు హై సెక్యూరిటీ ప్రిజన్. ఇక్కడ శుక్రవారం 90 మంది ఖైదీలకు పరీక్ష చేయగా.. వైరస్ బయటపడింది. అయితే ఫుజల్ జైలు కడలూరు, తిరుచ్చి జైళ్లు దగ్గరలోనే ఉంటాయి. అందులో ఉన్న ఖైదీల ద్వారా వైరస్ సోకిందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఫుజల్ జైలులో 30 మందిలో ఏడుగురిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మిగిలిన వారిని జైలులోనే ఉంచారు. జైలులో పరిస్థితిని అధికారులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం 874 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 618 చెన్నైలోనే నమోదయ్యాయి.
గత మూడురోజుల నుంచి రాష్ట్రంలో 800 పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిజాముద్దీన్, కోయంబేడు మార్కెట్ నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారి నుంచి కూడా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటి కేసుల్లో వలసకూలీల నుంచి 129, విమానాల ద్వారా వచ్చిన వారు ఆరు కేసులు ఉన్నాయి.
Recommended Video
తమిళనాడులో కరోనా వైరస్ రికవరీ కేసులు కూడా ఎక్కువే ఉంటున్నాయి. మొత్తం వైరస్ వచ్చిన సంఖ్య 20 వేల 246 కాగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11 వేల 313కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 765 మందిని డిశ్చార్జ్ చేశారు. గురువారం 12 మంది చనిపోగా.. శుక్రవారం 9 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.