12 ఏళ్ల బాలికపై 30 మంది లైంగిక దాడి: సహకరించిన తండ్రి! వారంతా అతని పరిచయస్తులేనట!
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాల బాలికపై 30 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోర కృత్యానికి బాధిత బాలిక తండ్రే సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులంతా అతని స్నేహితులేనని తెలిపారు. రెండేళ్లుగా బాలికపై వారు లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేరళ మలప్పురం జిల్లా తిరునంగడి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెలారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాశ్మీర్ లో పుల్వామా తరహా ఉగ్రదాడికి కుట్ర: 40 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం!
బాధిత బాలిక ఏడో తరగతి చదువుతోంది. లైంగిక వేధింపులపై పాఠశాల విద్యార్థినుల్లో అవగాహన కల్పించడానికి రెండు రోజుల కిందట ఛైల్డ్ లైన్ అనే స్వచ్ఛంద సంస్థ చెలారి పాఠశాలలో కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధిత బాలిక.. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ముందు తాను అనుభవించిన నరకయాతనను వెల్లడించింది. రెండేళ్ల నుంచీ 30 మంది వ్యక్తులు తనపై తరచూ అత్యాచారం చేస్తూ వచ్చారని పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడిన వారిలో కొందరు తనకు పరిచయస్తులని, మిగిలిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని తెలియజేసింది. బాధిత బాలిక ఆవేదనను విన్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారు జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి, తిరునంగడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే చెలారి పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. బాలికను విచారించారు. తనకు పరిచయం ఉన్న కొందరు వ్యక్తుల పేర్లు, వారి వివరాలను ఆమె అందజేసింది. బాలికపై అత్యాచారం చేసిన మెలె చెలారి గ్రామానికి చెందిన అష్రాఫ్, చెలక్కలంగడిలో నివసిస్తోన్న షైజును అరెస్టు చేశారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరుగుతున్న విషయం ఆమె తండ్రికి తెలుసని, అతనే తమను ప్రోత్సహించాడని, దీనికోసం తమ వద్ద డబ్బులు తీసుకునే వాడని నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల కోసం తండ్రే తన కుమార్తెపై లైంగిక దాడి చేయించినట్లు పోలీసులు నిర్ధారించారని ఛైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధి అన్వర్ కరక్కండన్ తెలిపారు. ఆ కుటుంబంలో బాధిత బాలిక ఒక్కరే సంతానమని, చెలారిలో ఓ అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారని అన్నారు.