సరిహద్దులో 300 మంది ఉగ్రవాదులు: ఆర్మీ
శ్రీనగర్: పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నియంత్రణ రేఖకు దగ్గర్లో దాదాపు 300 మంది మిలిటెంట్లు భారత్లోకి చొరబడడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శీతాకాలం వచ్చేలోపే చొరబడాలంటూ మిలిటెంట్లపై ఒత్తిడి పెరుగుతోందని ఆ ఉన్నతాధికారి చెప్పారు.
15 కోర్ సైనిక విభాగం ప్రధానాధికారి (జిఓసి) లెఫ్టెనెంట్ జనరల్ ఎస్కె దువా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శీతాకాలానికి ముందే చొరబడడానికి మిలిటెంట్లపై ఎక్కువ ఒత్తిడి వస్తోందని, గురెజ్లోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కాశ్మీర్లోకి మిలిటెంట్లను చొప్పించడానికి ఒక ప్రయత్నంలో భాగమై ఉండవచ్చని అన్నారు.
సోమవారం ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ‘మంచు కురవడం ప్రారంభం కావడానికి ముందే నియంత్రణ రేఖ వెంబడి మరింత ఎక్కువ మంది మిలిటెంట్లను చొప్పించడానికి జరిగిన ప్రయత్నంగా అది కనిపిస్తోంది' అని ఆయన చెప్పారు. దాదాపు 300 మంది మిలిటెంట్లు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత్లో చొరబడడడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంటూ ఇంటెలిజన్స్ నివేదికలు పేర్కొన్న విషయాన్ని దువా గుర్తు చేసారు.
శీతాకాలానికి ముందే చొరబడాలంటూ వారిపై ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని సార్లు వాళ్లు నియంత్రణ రేఖ దాటి వచ్చి కాల్పులు జరిపి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంటారని ఆయన చెప్పారు. కాగా, ఈ ఏడాది నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లు దాదాపుగా లేనట్లేనని, చొరబాట్ల నియంత్రణ వ్యవస్థ ఆ ప్రయత్నాలను విఫలం చేసేందుకు పూర్తి సన్నద్దంగా ఉందని ఆయన చెప్పారు.
‘చొరబాటు జరపాలన్న మిలిటెంట్ల ఉద్దేశంలో ఎలాంటి మార్పూ లేదు. అయితే అత్యంత పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఉంది' అని దువా చెప్పారు. గురెజ్ మామూలుగా మిలిటెంట్లు చొరబాటు జరిపే మార్గం కానందున అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగడం గురించి అడగ్గా, బహుశా మిలిటెంట్లు తమ వ్యూహాన్ని మార్చుకుని ఉండవచ్చని చెప్పారు.
అయితే భద్రతా వ్యవస్థ ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉందని చెప్పారు. గత వారం కరుడుగట్టిన లష్కరే తోయిబా మిలిటెంట్ అబూ కాసిమ్ హతం కావడం గురించి అడగ్గా, ఇది నిజంగా భద్రతా దలాలకు ఒక ప్రధానమైన విజయమని, ఆ సంస్థ కార్యకలాపాల సామర్థ్యానికి అది గట్టి ఎదురుదెబ్బేనని ఆయన చెప్పారు.