యూపీలో మరో ఘోరం: 300మంది విద్యార్థులకు అస్వస్థత, 30మందికి విషమం..
ఉత్తర్ప్రదేశ్లోని షమ్లీలో స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోని 300మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన రసాయనాలే చిన్నారుల అస్వస్థతకు కారణంగా తెలుస్తోంద
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని షమ్లీలో స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోని 300మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన రసాయనాలే చిన్నారుల అస్వస్థతకు కారణంగా తెలుస్తోంది.
మంగళవారం పాఠశాల ఓపెన్ చేసే సమయంలో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాలను తగలబెట్టడంతో రసాయనాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఆ రసాయనాల వల్లే కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోగా.. మరికొందరు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
కడుపునొప్పి, వాంతులు, కళ్ల మంటతో బాధపడుతున్న చిన్నారులను మీరట్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 300మంది చిన్నారుల్లో 30-35మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 15మంది చిన్నారులను మెరుగైన వైద్యం నిమిత్తం మీరట్ ఆసుపత్రికి తరలించాలని సూచించినట్లు చెప్పారు.
చిన్నారుల అస్వస్థతతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ పిల్లల జీవితాలకు షుగర్ ఫ్యాక్టరీ ముప్పుగా మారిందని ఆందోళనకు దిగారు. సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన షుగర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు.